రేపు అమరావతిలో కూటమి సభ...ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సీఎస్

  • రేపు సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ఏపీలో రాష్ట్ర స్థాయి వేడుకలు
  • అమరావతిలో రేపు సాయంత్రం బహిరంగ సభ 
  • బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
  • 175 నియోజకవర్గాల్లో కూటమి నేతల ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయోత్సవ ర్యాలీలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల రేపు అమరావతిలో బహిరంగ సభను నిర్వహించనున్నారు. ‘సుపరిపాలన – స్వర్ణాంధ్రప్రదేశ్’ పేరుతో జూన్ 12న రాష్ట్ర స్థాయి వేడుక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, అఖిల భారత సర్వీస్ అధికారులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే అమరావతి సచివాలయం భవనం వెనుక భాగంలో బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 5 గంటలకు అమరావతిలో నిర్వహించే ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొని, ఏడాదిలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించనున్నారు.

అదే విధంగా, రాబోయే నాలుగేళ్లలో ఎలాంటి కార్యక్రమాలను చేపట్టబోతున్నారు, ప్రణాళికలు, నాలుగేళ్ల పాలన ఏ విధంగా కొనసాగనుంది అనే విషయాలను ఈ వేదిక ద్వారా తెలియజేసే అవకాశం ఉంది. రాబోయే నాలుగేళ్ల పాలనకు సంబంధించి ఇప్పటికే ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే రేపు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు, సంబరాలు నిర్వహించేందుకు కూటమి నేతలు సన్నద్ధమయ్యారు. 


More Telugu News

Chandrababu Naidu Amaravati Andhra Pradesh Coalition Government Pawan Kalyan Public Meeting Governance Development Programs Welfare Schemes