బెంగళూరు తొక్కిసలాట ఘటనపై హర్ష్ గోయెంకా సంచలన పోస్ట్
- ఆర్సీబీ విజయోత్సవాల్లో తొక్కిసలాట, 11 మంది మృతిపై హర్ష్ గోయెంకా స్పందన
- సామాన్యుడి ప్రాణానికి విలువ లేదా అంటూ ప్రముఖ వ్యాపారవేత్త ఆవేదన
- గతంలో జరిగిన తొక్కిసలాటలను ప్రస్తావించిన గోయెంకా
- ఎవరూ బాధ్యత తీసుకోకపోవడం, రాజీనామాలు చేయకపోవడం విచారమని వ్యాఖ్య
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్దకు అంచనాలకు మించి జనం రావడంతో పాటు, అదే సమయంలో వర్షం కురవడంతో తొక్కిసలాట జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ దుర్ఘటన నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
హర్ష్ గోయెంకా తన ఎక్స్ ఖాతాలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. "ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. కుంభమేళాలో తొక్కిసలాట.. ఇప్పుడు బెంగళూరులో తొక్కిసలాట.. ఈ ఘటనల్లో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కానీ, ఇంతవరకు ఎవరూ బాధ్యత తీసుకోలేదు. రాజీనామాలు చేయలేదు. పాఠాలు నేర్చుకోలేదు" అని ఆయన పేర్కొన్నారు.
"మన దేశంలో సామాన్యుడి ప్రాణాలు అమూల్యమైనవి కావా? అంత విలువ లేదా? వారి ప్రాణం విలువ ఒక కప్ ఛాయ్ కంటే చౌకగా మారింది. ఇలాంటి ఘటనల తర్వాత అంతా యథావిధిగానే ఉంటోంది. ఏమీ మారట్లేదు" అంటూ గోయెంకా ఆవేదన వ్యక్తం చేశారు. తన పోస్ట్కు హృదయం ముక్కలైన ఎమోజీని కూడా ఆయన జతచేశారు.
నెటిజన్ల స్పందన
హర్ష్ గోయెంకా చేసిన ఈ పోస్ట్పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఇది చాలా దురదృష్టకర ఘటన. నిర్వాహకులు బాధ్యత తీసుకోవాలి. అయితే, అంతకంటే ముందు సామాన్యులు కూడా బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది" అని కొందరు కామెంట్ చేయగా, మరికొందరు సామాన్యుల భద్రతపై ప్రభుత్వాలు, నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని అభిప్రాయపడ్డారు.