ఐపీఎల్ ఫైనల్‌లో కోహ్లీ పిచ్ రన్నింగ్‌పై గవాస్కర్ తీవ్ర అసంతృప్తి.. అంపైర్ల తీరుపై విమర్శలు

  • కోహ్లీని అంపైర్లు ఎందుకు హెచ్చరించలేదని కామెంట్రీలో ప్రశ్నించిన గవాస్కర్
  • పిచ్ దెబ్బతింటే రెండో ఇన్నింగ్స్‌లో పంజాబ్‌కు నష్టమని వ్యాఖ్య
  • కోహ్లీ నెమ్మదైన బ్యాటింగ్‌పై మాథ్యూ హేడెన్ అసంతృప్తి
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గత రాత్రి జరిగిన ఐపీఎల్ ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లీ ప్రమాదకరంగా పిచ్ మధ్యలో పరుగెత్తినప్పటికీ ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోకపోవడంపై ఆయన మండిపడ్డారు. ఆర్‌సీబీ ఇన్నింగ్స్‌లో 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. బౌండరీలు రావడం కష్టంగా ఉన్న పిచ్‌పై కోహ్లీ సింగిల్స్, డబుల్స్‌తో స్కోరు బోర్డును నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో యజువేంద్ర చాహల్ వేసిన 12వ ఓవర్‌లో బంతిని లాంగ్-ఆన్ వైపు నెట్టి వేగంగా రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న భాగస్వామి లియామ్ లివింగ్‌స్టోన్ డైవ్ చేసి సురక్షితంగా క్రీజులోకి చేరుకున్నాడు.

ఈ క్రమంలో కోహ్లీ నేరుగా పిచ్ మధ్యలో పరుగెత్తాడు. సాధారణంగా ఇలా పరుగెత్తడం వల్ల పిచ్ దెబ్బతినే అవకాశం ఉందని, ఇది ఆటను ప్రభావితం చేస్తుందని భావిస్తారు. లైవ్ కామెంట్రీలో ఉన్న గవాస్కర్ ఈ విషయాన్ని వెంటనే ప్రస్తావించాడు. "కోహ్లీ వికెట్ల మధ్య చాలా వేగంగా పరుగెత్తుతాడు. బంతిని కొట్టిన వెంటనే అది రెండు పరుగులు వస్తుందని అతనికి తెలుసు" అని గవాస్కర్ అన్నాడు. "అతడిని ఏ అంపైర్ కూడా ఎప్పటికీ ఏమీ అనడు. ఇదుగో, మళ్లీ పిచ్ మధ్యలోనే పరుగెడుతున్నాడు. పంజాబ్ కింగ్స్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేయాల్సి ఉంది" అంటూ అంపైర్ల తీరును తప్పుబట్టారు.

అంపైర్లు ఈ విషయంలో జోక్యం చేసుకోనప్పటికీ, గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కొందరు టాప్ ఆటగాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడినా కొన్నిసార్లు ఉపేక్షిస్తారా అనే వాదనలు వినిపిస్తున్నాయి.

కోహ్లీ బ్యాటింగ్ శైలిపైనా భిన్నాభిప్రాయాలు
పిచ్ వివాదమే కాకుండా ఫైనల్‌లో కోహ్లీ బ్యాటింగ్ చేసిన విధానం కూడా పలువురిని ఆశ్చర్యపరిచింది. ఈ సీజన్‌లో దాదాపు 150 స్ట్రైక్ రేట్‌తో దూకుడుగా ఆడిన కోహ్లీ ఫైనల్‌లో మాత్రం అందుకు భిన్నంగా ఆచితూచి ఆడాడు. భారీ షాట్లకు ప్రయత్నించకుండా స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్ వంటి పవర్ హిట్టర్లకు ఎక్కువ బంతులు ఆడే అవకాశం కల్పించడంపై దృష్టి సారించాడు.

ఇంగ్లిష్ కామెంట్రీ బృందంలో ఉన్న ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్.. కోహ్లీ అనుసరించిన ఈ వ్యూహాన్ని ప్రశ్నించాడు. "ఇక్కడ 200 పరుగులు సాధారణ స్కోరే" అని వ్యాఖ్యానిస్తూ కోహ్లీ మరింత దూకుడుగా ఆడాల్సిందని అభిప్రాయపడ్డారు.

కోహ్లీ (43) చివరికి 15వ ఓవర్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అంతకుముందు, మొదటి స్ట్రాటజిక్ టైమ్-అవుట్ సమయంలో ఆర్‌సీబీ కోచ్‌లు ఆండీ ఫ్లవర్, దినేష్ కార్తీక్.. కోహ్లీతో తీవ్రంగా చర్చిస్తున్న దృశ్యాలు కనిపించాయి. బహుశా, స్కోరింగ్ రేటు పెంచాలని వారు సూచించినట్టు తెలుస్తోంది.  


More Telugu News