భారతదేశ అధికారిక భాష ఏంటో తెలుసా?.. స్పెయిన్‌లో కనిమొళి ఆసక్తికర ప్రశ్న

  • స్పెయిన్‌లో పర్యటిస్తున్న భారత అఖిలపక్ష ప్రతినిధి బృందం
  • డీఎంకే ఎంపీ కనిమొళి నేతృత్వంలో కొనసాగుతున్న పర్యటన
  • భారత జాతీయ భాష 'భిన్నత్వంలో ఏకత్వం' అని స్పష్టం చేసిన కనిమొళి
  • ఉగ్రవాదంపై పోరాటం, శాంతి స్థాపన ఆవశ్యకతపై నొక్కిచెప్పిన వైనం
భారతదేశ జాతీయ భాష 'భిన్నత్వంలో ఏకత్వం' అని డీఎంకే ఎంపీ కనిమొళి అన్నారు. 'ఆపరేషన్ సిందూర్' అనంతరం భారత ప్రభుత్వం చేపట్టిన విస్తృత ప్రచార కార్యక్రమంలో భాగంగా అఖిలపక్ష ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తూ స్పెయిన్‌లో పర్యటిస్తున్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. మాడ్రిడ్‌లో ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశంలో ఒకరు అడిగిన ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానమిచ్చారు.

"భారతదేశ జాతీయ భాష భిన్నత్వంలో ఏకత్వం. ఇదే మా ప్రతినిధి బృందం ప్రపంచానికి తీసుకువచ్చిన సందేశం. ఈ రోజుల్లో ఇదే అత్యంత ముఖ్యమైన విషయం" అని కనిమొళి స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) 2020లోని త్రిభాషా సూత్రం విషయంలో తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య ఇటీవల భాషా పరమైన విభేదాలు తలెత్తిన నేపథ్యంలో కనిమొళి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఉగ్రవాదంపై అడిగిన ప్రశ్నకు కనిమొళి సమాధానమిస్తూ "మన దేశంలో మనం చేయాల్సింది చాలా ఉంది, అది చేయాలని మేం కోరుకుంటున్నాం. దురదృష్టవశాత్తూ మా దృష్టి మరల్చబడుతోంది. ఉగ్రవాదం, యుద్ధం వంటి అనవసరమైన వాటితో మనం వ్యవహరించాల్సి వస్తోంది" అని కనిమొళి ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం సురక్షితమైన ప్రదేశమని, కశ్మీర్‌ను సురక్షితంగా ఉంచుతామని ప్రభుత్వం హామీ ఇస్తుందని ఆమె తెలిపారు.

ఐదు దేశాల పర్యటనలో భాగంగా కనిమొళి నేతృత్వంలోని ప్రతినిధి బృందానికి స్పెయిన్ చివరి మజిలీ. ఈ పర్యటన ముగించుకుని బృందం భారత్‌కు తిరిగి రానుంది. ఈ బృందంలో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ రాజీవ్ కుమార్ రాయ్, బీజేపీకి చెందిన బ్రిజేష్ చౌతా, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అశోక్ మిట్టల్, ఆర్జేడీకి చెందిన ప్రేమ్ చంద్ గుప్తా, మాజీ దౌత్యవేత్త మంజీవ్ సింగ్ పురి తదితరులు సభ్యులుగా ఉన్నారు. 


More Telugu News

Kanimozhi India national language Spain DMK MP Operation Sindoor National Education Policy 2020 terrorism Kashmir Indian diaspora Madrid