మావోయిస్టులకు భారీ షాక్... 2.5 టన్నుల పేలుడు పదార్థాలు స్వాధీనం

  • ఒడిశా-ఝార్ఖండ్ సరిహద్దులో భారీ సెర్చ్ ఆపరేషన్
  • విజయవంతంగా ముగిసిన ఐదు రోజుల ఉమ్మడి ఆపరేషన్
  • ఎలాంటి ఎదురుకాల్పులు లేకుండానే పేలుడు పదార్థాల స్వాధీనం
ఒడిశా-ఝార్ఖండ్ సరిహద్దుల్లో మావోయిస్టులు భారీ విధ్వంసానికి పన్నిన కుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. మావోయిస్టులు దాచిపెట్టిన సుమారు 2.5 టన్నులకు పైగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు ఓ సీనియర్ పోలీసు అధికారి వెల్లడించారు. 

ఈ భారీ ఆపరేషన్‌లో ఒడిశా రాష్ట్ర స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్), ఝార్ఖండ్ ఎలైట్ జాగ్వార్ ఫోర్స్, సుందర్‌గఢ్ డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (డీవీఎఫ్) కు చెందిన భద్రతా సిబ్బంది పాల్గొన్నారు. ఈ పేలుడు పదార్థాలను ఒక రాతి క్వారీకి తరలిస్తున్న సమయంలో మావోయిస్టులు వాటిని దోచుకున్నారన్న పక్కా సమాచారంతో ఈ ఉమ్మడి ప్రత్యేక ఆపరేషన్‌ను చేపట్టారు.

ఈ పేలుడు పదార్థాలు మావోయిస్టుల చేతిలో ఉంటే తీవ్ర కల్లోలం సృష్టించే ప్రమాదం ఉందని భావించిన భద్రతా దళాలు, మే 28వ తేదీన ఈ సెర్చింగ్ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. ఐదు రోజుల పాటు అటవీ ప్రాంతంలో జల్లెడ పట్టిన బలగాలు, చివరకు మావోయిస్టులు రహస్యంగా నిల్వ ఉంచిన 2.5 టన్నుల పేలుడు పదార్థాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నాయి.

అయితే, ఈ సెర్చింగ్ ఆపరేషన్ సమయంలో భద్రతా దళాలకు మావోయిస్టులు ఎవరూ తారసపడలేదు. దీనితో ఎటువంటి ఎదురుకాల్పులు జరగకుండానే ఈ ఆపరేషన్ ప్రశాంతంగా ముగిసింది. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను భారీ భద్రత నడుమ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు.


More Telugu News