పంజాబ్ విజ‌యం.. మైదానంలో ఆట‌గాడిని చూసి క‌న్నుగీటిన ప్రీతి జింటా.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

  • ఐపీఎల్ 2025 ఫైనల్లోకి దూసుకెళ్లిన పంజాబ్ కింగ్స్
  • ఎంఐతో జరిగిన క్వాలిఫయర్-2లో 5 వికెట్ల తేడాతో విజయం
  • కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అజేయంగా 87 పరుగులు
  • 11 ఏళ్ల విరామం తర్వాత పంజాబ్ ఫైనల్ బెర్త్ ఖరారు
  • ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పంజాబ్ ఢీ
  • అయ్య‌ర్‌తో క‌లిసి ప్రీతి జింటా సంబరాలు
  • నెట్టింట వైరల‌వుతున్న ఆమె క‌న్నుగీటిన వీడియో
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) అద్భుత ప్రదర్శనతో ఫైనల్లో అడుగుపెట్టింది. నిన్న ముంబ‌యి ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ విజయంతో 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ పంజాబ్ ఫైనల్‌కు అర్హత సాధించింది.

అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ ఉత్కంఠ పోరులో ముంబ‌యి ఇండియన్స్ నిర్దేశించిన 204 ప‌రుగుల‌ లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ మరో ఐదు వికెట్లు మిగిలి ఉండగానే ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 87 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతనికి నేహాల్ వధేరా 48 పరుగులతో విలువైన సహకారం అందించాడు.

పంజాబ్ కింగ్స్ విజయం ఖరారు కాగానే జట్టు సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఆనందంతో సంబ‌రాలు చేసుకున్నారు. స్టాండ్స్‌లో చిందులేస్తూ కనిపించిన ఆమె, ఆ తర్వాత మైదానంలోకి వచ్చి ఆటగాళ్లతో కలిసి సెల‌బ్రేష‌న్స్‌లో మునిగిపోయారు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, హెడ్ కోచ్ రికీ పాంటింగ్‌లను ఆలింగనం చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

"11 ఏళ్ల నిరీక్షణకు తెర‌ప‌డింది. పంజాబ్ కింగ్స్ టాటా ఐపీఎల్ 2025 ఫైనల్‌కు చేరింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కంటే మెరుగ్గా ఎవరు వారిని అక్కడికి తీసుకెళ్లగలరు" అంటూ ఐపీఎల్ అధికారిక ఖాతా ద్వారా ఈ సంబరాల వీడియోను ట్వీట్ చేసింది.

ఇక‌, పంజాబ్ సంబరాల‌ మధ్య ప్రజెంటేషన్ సెర్మనీ సమయంలో ప్రీతి జింటా పంజాబ్ ఆటగాళ్లలో ఒకరి వైపు చూసి కన్నుగీటిన దృశ్యం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన‌శైలిలో స్పందిస్తున్నారు. 

ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ జూన్ 3న జరిగే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. పంజాబ్ కింగ్స్ గానీ, ఆర్సీబీ గానీ ఇంతకుముందు ఐపీఎల్ టైటిల్ గెలవకపోవడంతో ఈసారి కొత్త ఛాంపియన్ ఆవిర్భవించడం ఖాయమైంది. శ్రేయస్ అయ్యర్ నాయకత్వం, రికీ పాంటింగ్ శిక్షణలో పంజాబ్ కింగ్స్ జట్టు ఈసారి అద్భుతమైన ఫలితాలు సాధించి, ప్రీతి జింటా, నెస్ వాడియా వంటి సహ యజమానుల ఆశలను నెరవేర్చింది.


More Telugu News