బుడమేరుకు గండ్లు పడిన ప్రాంతంలో మంత్రి నిమ్మల పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు
- గతేడాది బుడమేరు వరదలతో విజయవాడ అతలాకుతలం
- సింగ్ నగర్ వాసుల్లో ఇంకా వీడని వరద భయం
- గత చేదు అనుభవంతో అప్రమత్తంగా ఉన్న ప్రభుత్వం
ఆ భయానక పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. బుడమేరుకు పడిన మూడు ప్రధాన గండ్లను అత్యవసరంగా పూడ్చివేసి, వాటిని కలుపుతూ శాశ్వత పరిష్కారంగా రూ.23 కోట్ల వ్యయంతో కాంక్రీట్ గోడ (సీసీ వాల్) నిర్మాణ పనులను ప్రభుత్వం చేపట్టింది. మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నిర్మాణ పనుల పురోగతిని నిశితంగా పరిశీలించారు.
పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ వద్దని, వర్షాకాలం ప్రారంభమయ్యే లోగానే నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్లు, అధికారులను ఆయన గట్టిగా ఆదేశించారు. పనులు వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తిచేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పటిష్టమైన గోడ నిర్మాణం పూర్తయితే, భవిష్యత్తులో బుడమేరు వరదల నుంచి విజయవాడ నగరానికి రక్షణ లభిస్తుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.