Chandrababu Naidu: బీఆర్ఎస్ అనవసరంగా విమర్శలు చేస్తోంది: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu BRS Unnecessarily Criticizing
షార్ట్స్‌లో చూడండి
టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడపలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజున ఈ ఎన్నిక జరిగింది. పార్టీ ఎన్నికల అధికారి వర్ల రామయ్య ఈ మేరకు ప్రకటన చేశారు. మహానాడు వేదికగా, టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి, ప్రజ సంక్షేమమే తన ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని స్పష్టం చేశారు. తన అంతిమ లక్ష్యం రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపించడమేనని పునరుద్ఘాటించారు.

బహుళార్థసాధక పోలవరం ప్రాజెక్టును 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. సముద్రంలోకి వృధాగా పోయే నీటిని సద్వినియోగం చేసుకుంటే తెలంగాణకు కూడా ప్రయోజనం చేకూరుతుందని, దీనిపై బీఆర్ఎస్ అనవసర విమర్శలు చేస్తోందని అన్నారు. గోదావరిపై తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మిస్తే తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదని గుర్తుచేశారు.

పోలవరం నుంచి కృష్ణా నదికి, అక్కడి నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్‌కు, ఆపై బనకచర్లకు నీటిని తరలించే బృహత్తర ప్రణాళికను వివరించారు. "పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్ర ముఖచిత్రమే మారిపోతుంది. వంశధార నుంచి పెన్నా వరకు నదుల అనుసంధానం ద్వారా తెలుగు నేలకు జలహారతి ఇచ్చి, ఈ ప్రాంత రుణం తీర్చుకుంటాం" అని చంద్రబాబు పేర్కొన్నారు. 

Go Back to Shorts
Chandrababu Naidu
TDP Mahanadu
Telugu Desam Party
Polavaram Project
Andhra Pradesh
River Linking
Bollapalli Reservoir
Water Resources
AP Politics
Varla Ramaiah

More Telugu News