మరొక్కసారి ఈ గుండెను తాకిపో తాతా: జూనియర్ ఎన్టీఆర్ భావోద్వేగం

  • నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు
  • హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
  • పాల్గొన్న జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా తెలుగు ప్రజలు ఆయనను ఘనంగా స్మరించుకుంటున్నారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ నాయకులు, అభిమానులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.

ఎన్టీఆర్ సమాధి వద్ద ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్ రామ్ ప్రత్యేక పూజలు చేసి, పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన తాతను స్మరించుకుంటూ ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. "మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది. పెద్ద మనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా. సదా మీ ప్రేమకు బానిసను" అంటూ జూనియర్ ఎన్టీఆర్ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ పలువురి హృదయాలను తాకిందని, అభిమానులు "జోహార్ ఎన్టీఆర్" అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. 


More Telugu News