ఎన్‌టీఆర్ టీడీపీని స్థాపించిన ముహూర్త బ‌లం గొప్పది: మంత్రి లోకేశ్‌

  • ఇవాళ్టి నుంచి క‌డ‌ప‌లో అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం కానున్న మ‌హానాడు
  • పార్టీ పెద్ద పండుగ మహానాడు కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైన కడప నగరం 
  • మ‌హానాడు నేప‌థ్యంలో మంత్రి లోకేశ్ ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్ట్‌
  • కార్యకర్తలే పార్టీకి బలం, బలగమ‌న్న లోకేశ్‌
టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు పెద్ద పండ‌గ‌గా భావించే మ‌హానాడు ఇవాళ్టి నుంచి క‌డ‌ప‌లో అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభం కానుంది. పార్టీ పెద్ద పండుగ మహానాడు కోసం కడప నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఎటు చూసినా పసుపు జెండాలు, పచ్చని తోరణాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. 2024 ఎన్నికల్లో గెలిచిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కావడంతో టీడీపీ ఘనంగా నిర్వహిస్తోంది. 

ఇక‌, మహానాడు కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. మహానాడు కోసం కడప శివారు చెర్లోపల్లిలో భారీ ఏర్పాట్లు చేశారు. మొదటి రెండు రోజులు ప్రతినిధుల సభ, చివరి రోజు బహిరంగ సభ నిర్వహించ‌నున్నారు. కాగా, మ‌హానాడు నేప‌థ్యంలో పార్టీ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి, మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' (గ‌తంలో ట్విట్ట‌ర్) వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. 

"స్వ‌ర్గీయ ఎన్‌టీఆర్ టీడీపీని స్థాపించిన ముహూర్త బ‌లం గొప్ప‌ద‌ని లోకేశ్ అన్నారు. ఓ వీడియోను కూడా మంత్రి షేర్ చేశారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టిన ముహూర్త బలం గొప్పది. కార్యకర్తలే పార్టీకి బలం, బలగం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎత్తిన పసుపు జెండా దించకుండా పోరాడే కార్యకర్తలు నాకు నిత్య స్పూర్తి. ఈ రోజు నుంచి ప్రారంభం అవుతున్న పసుపు పండగ మహానాడుకు అందరికీ ఘన స్వాగతం పలుకుతున్నా" అని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. 


More Telugu News