బంగ్లాదేశ్ కి వార్నింగ్ ఇచ్చిన అసోం సీఎం

  • భారత్ 'చికెన్ నెక్' కారిడార్‌పై బెదిరింపులకు అసోం సీఎం హిమంత కౌంటర్
  • బంగ్లాదేశ్‌కు రెండు 'చికెన్ నెక్'లు ఉన్నాయని, అవి మరింత బలహీనమని వ్యాఖ్య
  • బంగ్లాదేశ్‌లోని 80 కి.మీ ఉత్తర కారిడార్, 28 కి.మీ చిట్టగాంగ్ కారిడార్‌ల ప్రస్తావన
భారతదేశానికి వ్యూహాత్మకంగా కీలకమైన 'చికెన్ నెక్ కారిడార్' గురించి తరచూ బెదిరింపులకు పాల్పడేవారికి అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ గట్టిగా బదులిచ్చారు. బంగ్లాదేశ్‌ను ఉద్దేశించి ఆయన తీవ్ర స్వరంతో మాట్లాడుతూ, భారత్‌కు ఒక చికెన్ నెక్ ఉంటే, బంగ్లాదేశ్‌కు అలాంటివి రెండు ఉన్నాయని, అవి మరింత బలహీనమైనవని తెలిపారు. భారత్ ను బెదిరిస్తే బంగ్లాదేశ్ కే నష్టమని హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్‌లో సన్నగా ఉండే సిలిగురి కారిడార్ ద్వారానే ఈశాన్య భారతదేశం మిగతా దేశంతో అనుసంధానమై ఉంటుంది. దీని వెడల్పు సుమారు 22 నుంచి 35 కిలోమీటర్ల మధ్య ఉంటుంది.

ఈ అంశంపై హిమంత బిశ్వ శర్మ ఈనెల 25న సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్టులో బంగ్లాదేశ్‌లోని రెండు కీలకమైన, బలహీనమైన ప్రాంతాలను ప్రస్తావించారు. మొదటిది, దక్షిణ దినాజ్‌పూర్ (భారత్) నుంచి నైరుతి గారో హిల్స్ (మేఘాలయ) మధ్య విస్తరించి ఉన్న 80 కిలోమీటర్ల ఉత్తర బంగ్లాదేశ్ కారిడార్. ఇక్కడ ఏదైనా అంతరాయం ఏర్పడితే, మొత్తం రంగ్‌పూర్ డివిజన్ బంగ్లాదేశ్‌లోని ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన తెలిపారు. ఇక రెండోది, దక్షిణ త్రిపుర నుంచి బంగాళాఖాతం వైపు వెళ్లే 28 కిలోమీటర్ల చిట్టగాంగ్ కారిడార్ అని వివరించారు. బంగ్లాదేశ్ ఆర్థిక రాజధాని చిట్టగాంగ్‌ను, రాజకీయ రాజధాని ఢాకాతో కలిపే ఏకైక మార్గం ఇదేనని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News