'కుబేర' టీజర్ వచ్చింది... చూశారా?... మాటల్లేవ్.. పాటే!

టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున, తమిళ స్టార్ హీరో ధనుష్‌, నటి రష్మిక మందన్న ప్రధాన పాత్రధారులుగా రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘కుబేర’. విలక్షణ దర్శకుడు శేఖర్‌ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా, చిత్ర యూనిట్‌ ఆదివారం ‘ట్రాన్స్‌ ఆఫ్‌ కుబేర’ పేరిట ఓ ప్రత్యేక టీజర్‌ను ప్రేక్షకులతో పంచుకుంది.

ఈ టీజర్‌ ద్వారా సినిమాలోని నాలుగు కీలక పాత్రలను పరిచయం చేశారు. విశేషమేమిటంటే, ఈ టీజర్‌లో ఎక్కడా సంభాషణలు లేకపోవడం గమనార్హం. కేవలం ‘నాది నాది.. నాదే ఈ లోకమంతా’ అనే ఫిలాసఫికల్ సాంగ్ నేపథ్యంగా సాగుతూ, పాత్రల స్వభావాలను సూచనప్రాయంగా చూపించారు. ఈ పాట టీజర్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

ప్రస్తుతం ఈ టీజర్‌ సోషల్‌ మీడియాలో సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను మరింత పెంచేదిగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ఈ చిత్రాన్ని జూన్‌ 20న విడుదల చేయనున్నారు. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ‘కుబేర’ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.


More Telugu News