'టూరిస్ట్ ఫ్యామిలీ' చిత్ర‌బృందంపై హీరో సూర్య ప్ర‌శంస‌ల జ‌ల్లు

  • మే 01న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్‌గా నిలిచిన 'టూరిస్ట్ ఫ్యామిలీ'
  • శశికుమార్, సిమ్రాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన మూవీ
  • అభిషాన్ జీవింత్ దర్శకత్వం 
  • ఇప్ప‌టికే ఈ చిత్రాన్ని మెచ్చుకున్న ర‌జ‌నీకాంత్‌, శివ‌కార్తికేయ‌న్, రాజ‌మౌళి
  • తాజాగా మూవీ టీమ్‌ను క‌లిసి, వారితో ముచ్చ‌టించిన సూర్య‌
  • ఈ విష‌యాన్ని తెలుపుతూ ద‌ర్శ‌కుడు అభిషాన్ 'ఎక్స్' వేదిక‌గా పోస్టు
ఇటీవ‌ల చిన్న సినిమాగా వ‌చ్చి పెద్ద‌ హిట్‌ను సొంతం చేసుకున్న మూవీ టూరిస్ట్ ఫ్యామిలీ. త‌మిళ న‌టులు శశికుమార్, సిమ్రాన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించ‌గా.. యోగి బాబు, మిథున్ జై శంకర్, కమలేష్ జెగన్ తదిత‌రులు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అభిషాన్ జీవింత్ దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రం మే 01న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి సూప‌ర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా చూసిన ప్రేక్ష‌కులు చాలా బాగుందని ప్ర‌శంసిస్తున్నారు. 

ఇప్ప‌టికే సూప‌ర్ స్టార్‌ ర‌జ‌నీకాంత్‌, న‌టుడు శివ‌కార్తికేయ‌న్ ఈ సినిమా చూసి చిత్ర‌బృందాన్ని ప్ర‌త్యేకంగా పిలిపించుకుని అభినందించారు. అలాగే ద‌ర్శ‌క ధీరుడు ఎస్ఎస్ రాజ‌మౌళి కూడా మూవీని ప్ర‌శంసిస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు పెట్టారు. మంచి సినిమా అని, అంద‌రూ త‌ప్ప‌క చూడాల‌ని కోరారు. తాజాగా మ‌రో స్టార్ హీరో సూర్య సైతం టూరిస్ట్ ఫ్యామిలీ చిత్ర‌బృందంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు. 

తాజాగా ఆయ‌న మూవీ టీమ్‌ను క‌లిసి, వారితో ముచ్చ‌టించారు. ఈ విష‌యాన్ని తెలుపుతూ ద‌ర్శ‌కుడు అభిషాన్ 'ఎక్స్' (గ‌తంలో ట్విట్ట‌ర్‌) వేదిక‌గా పోస్టు పెట్టారు. "ఈ అనుభూతిని ఎలా వ‌ర్ణించాలో తెలియ‌డం లేదు. ఎప్ప‌ట్నుంచో ఉన్న బాధ ఇప్పుడు తీరిన‌ట్లు ఉంది. సూర్య న‌న్ను క‌లిశారు. మూవీ ఆయ‌న‌కు ఎంతో న‌చ్చిందని ప్ర‌శంసించారు. 'సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్' సినిమా 100 సార్లు చూసిన నేను ఇప్పుడు భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక‌పోతున్నాను. ధ‌న్య‌వాదాలు సార్" అంటూ ట్వీట్ చేశారు. 

కాగా, టూరిస్ట్ ఫ్యామిలీ చిత్రం ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. కేవ‌లం రూ. 5 కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ఇప్ప‌టివ‌ర‌కు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిందని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. సూప‌ర్ హిట్‌గా నిలిచిన ఈ మూవీని మ‌రిన్ని భాష‌ల్లోనూ విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఇవాళ్టి నుంచి ఈ చిత్రం జపాన్‌లోనూ అల‌రించ‌నుంది. 

ఇక‌, ఈ మూవీ స్టోరీ విష‌యానికి వ‌స్తే... శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక తమిళ కుటుంబం తమ స్వస్థలాన్ని విడిచిపెట్టి భారతదేశానికి శరణార్థులుగా వస్తారు. అనంతరం వారు చెన్నైలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కానీ వాళ్లు ఎవరు అనేది చెప్పకుండా దాచిపెట్టాల్సి వస్తుంది. 

అలా దాచిపెడుతూ ఉండగా అనుకోకుండా రామేశ్వ‌రం ద‌గ్గ‌ర ఒక బాంబ్ బ్లాస్ట్ సంఘ‌ట‌న జ‌రుగుతుంది. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు దర్యాప్తు చేయడం మొదలుపెడతారు. అయితే, ఈ కేసుకి వీరికి సంబంధంమేంటి? శ్రీలంక నుంచి వ‌చ్చిన ఈ ఫ్యామిలీకి ఎదురైన స‌మ‌స్య‌లేమిటి? అనేది ఈ సినిమా స్టోరీ. 



More Telugu News