కార్తిక్ రాజు హీరోగా ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ చిత్రం ప్రారంభం

  • రాజా దుస్సా దర్శకత్వంలో కొత్త చిత్రం
  • నేడు హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలు
  • క్లాప్ కొట్టిన సీనియర్ నిర్మాత సురేష్ బాబు
రీసెంట్ సెన్సేషన్ 'అనగనగా' ఫేమ్ కాజల్ చౌదరి హీరోయిన్‌గా, కార్తిక్ రాజు హీరోగా శ్రీ రామకృష్ణ సినిమా బ్యానర్ మీద గాలి కృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రం ‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’. ఈ సినిమాకు రాజా దుస్సా దర్శకత్వం వహిస్తున్నారు. మల్లవరం  వేంకటేశ్వర రెడ్డి , రూప కిరణ్ గంజి సహ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కార్తికేయ శ్రీనివాస్, లైన్ ప్రొడ్యూసర్‌గా కీసరి నరసింహ (KNR), ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా సుబ్బు, ఆర్ట్ డైరెక్టర్‌గా రవి కుమార్ గుర్రం, మ్యూజిక్ డైరెక్టర్‌గా సురేష్ బొబ్బలి, గీత రచయితగా కాసర్ల శ్యామ్, కెమెరామెన్‌గా గంగానమోని  శేఖర్ పని చేయనున్నారు.

‘అట్లాస్ సైకిల్ అత్తగారు పెట్లే’ సినిమాను శుక్రవారం (మే 23) గ్రాండ్‌గా లాంచ్ చేశారు. రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాలకు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, క్రాంతి మాధవ్, హీరో చైతన్య  వంటి వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ స్క్రిప్ట్ అందజేశారు. ముహూర్తపు సన్నివేశానికి సురేష్ బాబు క్లాప్ కొట్టగా.. హీరో చైతన్య కెమెరా స్విచ్ ఆన్ చేయగా, తొలి షాట్ కి భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు.

అనంతరం దర్శకుడు రాజా దుస్సా మాట్లాడుతూ.. ‘ఇదొక పీరియాడికల్ మూవీ. హాస్యంతో పాటు ఎమోషనల్‌గానూ ఈ చిత్రం ఉంటుంది. 1980 లో వరంగల్‌లో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నాం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. కార్తిక్ రాజు, కాజల్ చౌదరితో ఈ సినిమా చేస్తుండటం ఆనందంగా ఉంది. మా నిర్మాత గాలి కృష్ణ సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. ఈ రోజు మా కోసం వచ్చిన సురేష్ బాబు గారు, తమ్మారెడ్డి గారు, భీమనేని శ్రీనివాసరావు గారు, క్రాంతి మాధవ్ గారు, చైతన్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను" అని వివరించారు. ఇదివరకు దర్శకుడు రాజా దుస్సా హన్సికతో ‘105 మినిట్స్’ అనే ఓ ప్రయోగాత్మక చిత్రాన్ని తీసి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.

హీరో కార్తిక్ రాజు మాట్లాడుతూ.. ‘80వ దశకంలో జరిగే కథతో ఈ చిత్రం రాబోతోంది. కాజల్ చౌదరి ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఆమెతో కలిసి నటిస్తుండటం ఆనందంగా ఉంది. మంచి కథను నాకు ఇచ్చిన మా దర్శకుడు రాజా దుస్సా, నిర్మాత గాలి కృష్ణ గారికి థాంక్స్. మున్ముందు మా సినిమా నుంచి మరిన్ని అప్డేట్‌లు వస్తాయి" అని అన్నారు.

కాజల్ చౌదరి మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నటిస్తుండటం ఆనందంగా ఉంది. కథ చాలా బాగుంటుంది. ఇదొక యూనిక్ స్టోరీ. మంచి టీంతో పని చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు ప్రస్తుతం నా మీద ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. ఈ చిత్రంతోనూ నన్ను ఆదరిస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ఈ చిత్రంలో  కార్తిక్ రాజు, కాజల్ చౌదరి,  తమ్మారెడ్డి భరద్వాజ, భీమనేని శ్రీనివాసరావు, సురభి ప్రభావతీ, శ్రీధర్ రెడ్డి, ప్రభావతీ, అభయ్, ఫణి,  పద్మ, కీర్తిలత తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా, కాసర్ల శ్యామ్ సింగిల్ కార్డ్ తో పాటలు రాస్తున్నాడు.


More Telugu News