భారత అండర్-19 జట్టులోకి వైభవ్ సూర్యవంశీ.. కెప్టెన్‌గా ఆయుష్ మాత్రే

  • ఇంగ్లండ్ పర్యటనకు భారత అండర్-19 క్రికెట్ జట్టు ఎంపిక
  • వికెట్ కీపర్ అభిజ్ఞాన్ కుందు వైస్ కెప్టెన్‌గా నియామకం
  • జూన్ 24 నుంచి ఇంగ్లండ్‌లో భారత యువ జట్టు పర్యటన
భారత యువ క్రికెట్ జట్టు త్వరలో ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టనుంది. వచ్చే నెలలో ఆరంభమయ్యే ఈ కీలక పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించారు. ముంబై ఆటగాడు ఆయుష్ మాత్రే యువ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. 14 ఏళ్ల వయసులోనే బ్యాటింగ్‌లో అద్భుతాలు సృష్టిస్తున్న వైభవ్ సూర్యవంశీ కూడా ఈ జట్టులో స్థానం దక్కించుకోవడం విశేషం.

ఇప్పటికే ఐపీఎల్‌లో ఆయుష్ మాత్రే చెన్నై సూపర్ కింగ్స్ తరఫున, వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ముఖ్యంగా, వైభవ్ సూర్యవంశీ గుజరాత్ టైటాన్స్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ నమోదు చేసి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. వైభవ్ ఇప్పటికే బీహార్ తరఫున ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, ఒక లిస్ట్- మ్యాచ్ ఆడిన అనుభవం సంపాదించాడు. 17 ఏళ్ల ఆయుష్ మాత్రే కూడా దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటుతూ 9 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, ఏడు లిస్ట్- మ్యాచ్‌లు ఆడాడు. ఇక, ముంబైకే చెందిన వికెట్ కీపర్ బ్యాటర్ అభిజ్ఞాన్ కుందు భారత అండర్-19 జట్టుకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

జూన్ 24న ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా భారత యువ జట్టు ఒక 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్ ఆడుతుంది. అనంతరం, ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఐదు యూత్ వన్డేల సిరీస్‌లో తలపడుతుంది. పర్యటన చివరలో రెండు టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడనుంది.  

భారత అండర్-19 జట్టు సభ్యులు 
ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిగ్ చవ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (వైస్ కెప్టెన్), హర్‌వక్ష్ సింగ్, అంబ్రిష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ పటేల్, హెనిల్ పటేల్, యుధజిత్ గుహ, ప్రణవ్ రాఘవేంద్ర, మహ్మద్ ఎనాన్, ఆదిత్య రాణా, అన్మోల్‌జీత్ సింగ్.


More Telugu News