జూన్ 1 నుంచి ఏపీలో చౌక ధరల దుకాణాల ద్వారానే రేషన్ పంపిణీ .. ఎండీయు వాహనాలపై మంత్రి నాదెండ్ల ఏమన్నారంటే..?

  • రేషన్ ఎండీయూ వాహన వ్యవస్థ రద్దు చేస్తున్నారంటూ ప్రచారం
  • జూన్ 1 నుంచి ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారానే రేషన్ పంపిణీ అంటూ వార్తలు
  • రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నామన్న మంత్రి నాదెండ్ల మనోహర్
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 1వ తేదీ నుంచి చౌక ధరల దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు పంపిణీ చేస్తారని, ఎండీయూ వాహన వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. పలు ప్రాంతాల్లో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు సైతం సమావేశాలు నిర్వహించి రేషన్ షాపుల ద్వారానే ఇకపై రేషన్ పంపిణీ జరుగుతుందని, డీలర్లు సక్రమంగా కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలని సూచనలు చేస్తున్నారు. ఈ విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఎండీయు వాహనాల వ్యవస్థను తొలగిస్తారని కూడా ప్రచారం జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సైతం ఇంటింటికి రేషన్ పేరుతో ఏర్పాటు చేసినా ఆ వాహనాలు వీధి రేషన్‌గా మారిందని విమర్శించారు. ఎండీయూ వాహనాల వల్ల ప్రజలకు మేలు జరగకపోగా, ప్రభుత్వానికి అదనపు భారం అవుతోందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఇదే క్రమంలో ఇంతకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా రేషన్ పంపిణీ చేయాలా, లేక ఎండీయూ వాహనాల వల్ల ఉపయోగకరంగా ఉందా అనే విషయంపై కార్డుదారుల నుంచి ప్రభుత్వం అభిప్రాయాలను సైతం సేకరించింది. అయితే దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై తాజాగా మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు.

రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న మొబైల్ రేషన్ డెలివరీ (ఎండీయూ) వాహనాలు కొనసాగించాలా లేదా నిలిపివేయాలా అన్న విషయంపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఓ మహిళ ఎండీయూ వాహనం వచ్చినప్పుడు ఇంటి వద్ద ఉండి సరుకులు తీసుకోవడం కుదరడం లేదని, మరో సారి వాహనం రాకపోవడంతో సరుకులు కోల్పోతున్నట్లు వాపోయింది. ఈ సందర్భంగా మంత్రి పై విధంగా వ్యాఖ్యానించారు. 

Minister Nadeendla Manohar
Andhra Pradesh Ration Distribution
PDS Shops
MDV Vehicles
Ration Supply
AP Ration System
Public Distribution System
Telugu News

More Telugu News