‘ఇక చాలు అనుకున్నాడు’.. కోహ్లీ నిర్ణయంపై రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు

  • నిర్ణయానికి వారం ముందే కోహ్లీ తనతో మాట్లాడాడన్న రవిశాస్త్రి
  • దేశానికి తన వంతు సేవ పూర్తి చేశానని కోహ్లీ భావించాడన్న మాజీ కోచ్
  • మానసికంగా పూర్తిగా అలసిపోవడమే రిటైర్మెంట్‌కు కారణమని స్పష్టీకరణ
  • కోహ్లీ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందన్న రవిశాస్త్రి
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలకడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, ఈ నిర్ణయం తీసుకునే ముందు కోహ్లీ తనతో మాట్లాడాడని భారత జట్టు మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి తాజాగా వెల్లడించాడు. మే 12న కోహ్లీ తన రిటైర్మెంట్ ప్రకటించగా, దానికి వారం రోజుల ముందే ఈ విషయంపై తమ మధ్య చర్చ జరిగిందని శాస్త్రి తెలిపారు.

‘ది ఐసీసీ రివ్యూ’లో సంజనా గణేశన్‌తో మాట్లాడుతూ రవిశాస్త్రి ఈ విషయాలను పంచుకున్నాడు. "రిటైర్మెంట్ ప్రకటించడానికి వారం రోజుల ముందు కోహ్లీ నాతో మాట్లాడాడు. టెస్ట్ క్రికెట్‌లో తాను ఇవ్వగలిగిందంతా ఇచ్చేశానని, ఇక ఎలాంటి పశ్చాత్తాపం లేదని చాలా స్పష్టంగా చెప్పాడు. అతని మనసులో ఎలాంటి సందేహాలు లేవని అర్థమైంది. నేను కొన్ని వ్యక్తిగత ప్రశ్నలు అడిగాను, వాటికి కూడా అతను నిక్కచ్చిగా సమాధానమిచ్చాడు. అప్పుడే ‘అవును, అతను సరైన సమయానికే ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు’ అని నాకు అనిపించింది. అతని శరీరం కంటే ముందు మనసు 'ఇక చాలు, వెళ్లే సమయం వచ్చింది' అని చెప్పినట్లుంది" అని శాస్త్రి వివరించారు.

కోహ్లీ తన ఆట పట్ల ఎంతో నిబద్ధతతో ఉంటాడని, జట్టు కోసం వంద శాతం కష్టపడతాడని శాస్త్రి కొనియాడాడు. "ఒక ఆటగాడిగా అతను చేసేది చేసి పక్కకు తప్పుకోడు. జట్టు మైదానంలోకి వెళ్తే, అన్ని వికెట్లు తానే తీయాలని, అన్ని క్యాచ్‌లు తనే పట్టాలని, మైదానంలో అన్ని నిర్ణయాలు తనే తీసుకోవాలి అన్నంతగా లీనమైపోతాడు. దీనివల్ల సరైన విశ్రాంతి తీసుకోకపోతే ఏదో ఒక సమయంలో మానసికంగా అలసిపోవడం ఖాయం" అని శాస్త్రి అభిప్రాయపడ్డారు.

కోహ్లీ అసాధారణమైన స్టార్‌డమ్, నిరంతరం అతనిపై ఉండే మీడియా దృష్టి కూడా ఈ మానసిక అలసటకు దోహదపడి ఉండవచ్చని రవి పేర్కొన్నాడు. కోహ్లీ నిర్ణయం తనను ఆశ్చర్యపరిచిందని అతనిలో ఇంకా రెండు, మూడు సంవత్సరాల టెస్ట్ క్రికెట్ మిగిలి ఉందని తాను భావించినట్లు శాస్త్రి అంగీకరించాడు. "శారీరకంగా ఎంత ఫిట్‌గా ఉన్నా, మానసికంగా పూర్తిగా అలసిపోయినప్పుడు, శరీరం కూడా అదే సంకేతాన్నిస్తుంది. అదే జరిగింది" అని శాస్త్రి అన్నాడు.

విరాట్ కోహ్లీ భారత్‌కు అత్యంత విజయవంతమైన టెస్ట్ కెప్టెన్‌గా నిలిచాడు. 68 టెస్టులకు నాయకత్వం వహించి 40 విజయాలు అందించాడు. బ్యాటర్‌గా కూడా 9230 పరుగులతో, 30 సెంచరీలతో టెస్టుల్లో అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు. శాస్త్రి-కోహ్లీ ద్వయం భారత టెస్ట్ క్రికెట్‌లో ఆస్ట్రేలియాలో చారిత్రక సిరీస్ విజయం వంటి అనేక చిరస్మరణీయ విజయాలను అందించింది.


More Telugu News