దశాబ్దాల బాధకు ఇది సమాధానం: జాన్వీ కపూర్
- జమ్మూ దాడి దృశ్యాలు చూసి దిగ్భ్రాంతి చెందానన్న జాన్వీ
- భారత్ ది దుందుడుకు చర్య కాదని వ్యాఖ్య
- యుద్ధంలో అమాయకుల మరణంపై విచారం
"ఇప్పటివరకు నేనెప్పుడూ అనుభవించని తీవ్ర ఆందోళన ఇది. గతంలో విదేశాల్లో ఇలాంటి దాడులు జరిగినప్పుడు శాంతియుతంగా ఉండాలని కోరుకునేవాళ్లం. కానీ, ఇప్పుడు అదే దుస్థితి మన దేశానికి వచ్చింది. భారత్ ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వదు. మనది దూకుడు కాదు... దశాబ్దాల తరబడి అనుభవిస్తున్న బాధకు ఇది సమాధానం. మనల్ని, మన భూభాగాన్ని, మన సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు మన సైనికులు నిరంతరం శ్రమిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనమందరం ఐక్యంగా ఉంటూ వారికి సంపూర్ణ మద్దతు అందించాలి. దాయాది దేశం సాగిస్తున్న అరాచకత్వాన్ని ఇకపై ఉపేక్షించేది లేదని, వారికి తగిన రీతిలో గట్టిగా బదులిస్తామని తెలిసొచ్చేలా చేయాలి" అని ఆమె పిలుపునిచ్చారు.
ఈ ఘర్షణల వల్ల అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటం తనను తీవ్రంగా బాధిస్తోందని జాన్వీ పేర్కొన్నారు. ఈ హింసాత్మక వాతావరణానికి త్వరలోనే శాశ్వతమైన ముగింపు లభించాలని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. మన సైనికుల కోసం తాను నిరంతరం ప్రార్థిస్తుంటానని చెప్పారు.