రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటనపై కపిల్ దేవ్ స్పందన

  • ఆటగాడిగా, నాయకుడిగా రోహిత్ సేవలను కొనియాడిన కపిల్
  • టెస్టుల్లో రోహిత్ స్థానాన్ని భర్తీ చేయడం కష్టమని వ్యాఖ్య
  • 2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ ఆడటంపై సెలక్టర్లదే తుది నిర్ణయమన్న కపిల్
భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు అనూహ్యంగా వీడ్కోలు పలకడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇంగ్లండ్ పర్యటనకు టెస్ట్ కెప్టెన్‌గా రోహిత్‌ను తప్పించనున్నారనే వార్తలు వెలువడిన కొన్ని గంటల్లోనే అతడు ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదివరకే టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్, ఇకపై వన్డే క్రికెట్‌లో మాత్రమే కొనసాగనున్నాడు. ఈ పరిణామాలపై భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందించాడు. రోహిత్ శర్మ సేవలను కొనియాడుతూ కపిల్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

"ఆటగాడిగా, కెప్టెన్‌గా రోహిత్ శర్మ జట్టును అద్భుతంగా నడిపించాడు. చాలా మంచి క్రికెట్ ఆడాడు. ముఖ్యంగా అతడి కెప్టెన్సీ తీరు, అతను క్రికెట్ ఆడిన విధానం ప్రశంసనీయం. భారత క్రికెట్ చరిత్రలో కొద్ది మంది మాత్రమే ఇలాంటి ఆటతీరును ప్రదర్శించారు" అని కపిల్ దేవ్ కొనియాడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో కెప్టెన్‌గా రోహిత్‌కు ప్రత్యామ్నాయాన్ని కనుగొనడం అంత సులభం కాదని అభిప్రాయపడ్డాడు. "అద్భుతమైన కెరీర్‌కు వీడ్కోలు పలికిన రోహిత్‌కు నా అభినందనలు" అని కపిల్ పేర్కొన్నాడు.

ఇక, రోహిత్ శర్మ 2027 వన్డే ప్రపంచకప్ ఆడతాడా లేదా అనే చర్చపైనా కపిల్ దేవ్ తనదైన శైలిలో స్పందించాడు. రోహిత్ చిన్ననాటి కోచ్ దినేశ్ లాడ్, హిట్‌మ్యాన్ 2027 ప్రపంచకప్ తర్వాతే అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతాడని ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కపిల్ దేవ్ ఈ అంశంపై మాట్లాడాడు.

"ప్రతి ఒక్క క్రీడాకారుడు సాధ్యమైనంత ఎక్కువ కాలం ఆడాలని కోరుకుంటాడు. సచిన్, గవాస్కర్ వంటి గొప్ప ఆటగాళ్లు కూడా ఇదే విధంగా ఆడాలని ఆశించారు. అయితే, జట్టు ఎంపిక అనేది సెలక్టర్ల పరిధిలోని విషయం. రోహిత్ ఆడాలని కోరుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ప్రపంచ కప్ ఆడాలని, గెలవాలని కోరుకుంటారు. కానీ కొన్ని విషయాలను సెలక్టర్ల విచక్షణకే వదిలేయాలి" అని కపిల్ దేవ్ స్పష్టం చేశాడు.


More Telugu News

Rohit Sharma Retirement Test Cricket Kapil Dev India Cricket Team ODI Cricket