Rahul Gandhi: ఉగ్రదాడిలో మరణించిన నేవీ అధికారి కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్ గాంధీ

- ఏప్రిల్ 22న పహల్గామ్ లో ఉగ్రదాడి
- నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ మృతి
- హర్యానాలో వినయ్ నర్వాల్ ఇంటికి వెళ్లిన రాహుల్ గాంధీ
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ కుటుంబ సభ్యులను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పరామర్శించారు. హర్యానాలోని నర్వాల్ నివాసానికి వెళ్లిన ఆయన, కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి, వారిని ఓదార్చారు. తాము అండగా ఉంటామని తెలిపారు.
హర్యానాకు చెందిన వినయ్ నర్వాల్, హిమాన్షిల వివాహం ఏప్రిల్ 16న ఘనంగా జరిగింది. అనంతరం ఏప్రిల్ 19న బంధుమిత్రుల కోసం విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు. నూతన జీవితాన్ని ఆరంభించిన ఈ జంట, మధుర జ్ఞాపకాల కోసం తొలుత యూరప్ వెళ్లాలని భావించినప్పటికీ, వీసా సమస్యల కారణంగా తమ ప్రయాణాన్ని జమ్మూకశ్మీర్కు మార్చుకున్నారు. అయితే, హనీమూన్కు వెళ్లిన కొద్ది రోజులకే ఉగ్రదాడి రూపంలో విధి వెక్కిరించింది. ఈ దాడిలో వినయ్ నర్వాల్ తీవ్రంగా గాయపడి మరణించడంతో, హిమాన్షి జీవితంలో పెను విషాదం అలుముకుంది. వివాహమైన వారం రోజులు కూడా గడవకముందే, కళ్లెదుటే తన భర్త ప్రాణాలు కోల్పోవడాన్ని చూసిన ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. భర్త అంత్యక్రియల సమయంలో సైనిక లాంఛనాలతో సెల్యూట్ చేస్తూ ఆమె కన్నీరుమున్నీరైన దృశ్యాలు అందరినీ కదిలించాయి.