హైదరాబాద్ ఆశలపై నీళ్లు కుమ్మరించిన వరుణుడు.. ప్లే ఆఫ్స్ నుంచి అవుట్!
- ఢిల్లీ క్యాపిటల్స్తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు
- ఐపీఎల్ ప్లేఆఫ్స్ రేసు నుంచి ఎస్ఆర్హెచ్ నిష్క్రమణ
- వర్షం వల్ల ఆట సాధ్యపడక ఇరుజట్లకు చెరో పాయింట్
- 11 మ్యాచుల్లో మూడే గెలిచిన హైదరాబాద్
కమిన్స్ జోరు.. ఢిల్లీ విలవిల
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ను సన్రైజర్స్ బౌలర్లు కట్టడి చేశారు. ముఖ్యంగా కెప్టెన్ పాట్ కమిన్స్ తన పేస్ బౌలింగ్తో ఢిల్లీ బ్యాటింగ్ లైనప్ను కుప్పకూల్చాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే కరుణ్ నాయర్ను వికెట్ కీపర్ క్యాచ్తో పెవిలియన్ పంపిన కమిన్స్, తన తర్వాతి ఓవర్లో ఫా డుప్లెసిస్ను కూడా అదే తరహాలో ఔట్ చేశాడు. కొద్దిసేపటికే అభిషేక్ పోరెల్ను కూడా కమిన్స్ పెవిలియన్కు పంపడంతో ఢిల్లీ కష్టాల్లో పడింది. ఆ తర్వాత హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ కూడా వికెట్లు తీయడంతో ఢిల్లీ 7.1 ఓవర్లలో 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఢిల్లీ బ్యాటర్ల పేలవమైన షాట్ సెలక్షన్ కూడా వారి పతనానికి కారణమైంది.
ఆదుకున్న స్టబ్స్, అశుతోష్
ఈ దశలో క్రీజులోకి వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్ (36 బంతుల్లో 41 నాటౌట్), ఇంపాక్ట్ ప్లేయర్ అశుతోష్ శర్మ (26 బంతుల్లో 41) జట్టును ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్కు 45 బంతుల్లో 66 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అశుతోష్ శర్మ దూకుడుగా ఆడి స్పిన్నర్ జీషన్ అన్సారీ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదాడు. స్టబ్స్ కూడా అతనికి చక్కటి సహకారం అందించాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసే సమయానికి 7 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసి గౌరవప్రదమైన స్కోరు సాధించింది.
వరుణుడి అంతరాయం.. మ్యాచ్ రద్దు
సన్రైజర్స్ విజయానికి 134 పరుగులు అవసరమైన దశలో భారీ వర్షం ప్రారంభమైంది. ఎంతకీ తగ్గకపోవడంతో మైదానం చిత్తడిగా మారింది. ఔట్ఫీల్డ్లో నీరు నిలిచిపోవడంతో ఆటను కొనసాగించడం సాధ్యం కాలేదు. పరిస్థితులను సమీక్షించిన మ్యాచ్ అధికారులు రాత్రి 11:10 గంటలకు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో పాయింట్లు పంచుకున్న ఇరు జట్లు డ్రెస్సింగ్ రూమ్కు పరిమితమయ్యాయి. గతేడాది ఫైనల్ చేరిన సన్రైజర్స్, ఈ సీజన్లో బ్యాటింగ్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. బౌలర్లు రాణించిన ఈ మ్యాచ్లో విజయం సాధించి పరువు నిలుపుకుందామనుకున్న హైదరాబాద్ ఆశలపై వర్షం నీళ్లు చల్లింది.