మరోసారి మానవత్వాన్ని చాటుకున్న మంత్రి నాదెండ్ల

  • ఏలూరు జిల్లా భీమడోలు వద్ద రోడ్డు ప్రమాదం
  • ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఇన్నోవా: ఇద్దరికి తీవ్ర గాయాలు
  • మంత్రి నాదెండ్ల మనోహర్ కాన్వాయ్ ఆపి సహాయ చర్యలు
  • అంబులెన్స్‌కు ప్రోటోకాల్ వాహనంతో ఎస్కార్ట్ ఏర్పాటు
  • మెరుగైన వైద్యం కోసం జిల్లా ఎస్పీకి మంత్రి ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మానవతా దృక్పథంతో స్పందించి, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి సత్వర సహాయం అందించారు. విజయవాడ నుంచి కాకినాడ వెళుతున్న సమయంలో, ఏలూరు జిల్లా భీమడోలు మండలం ఎం. నాగులపల్లి అడ్డరోడ్డు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయాన్ని ఆయన గమనించారు. బాధితులకు సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు.

వివరాల్లోకి వెళితే, జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న ఒక ఇన్నోవా కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి రోడ్డుపై పడిపోయారు. అదే మార్గంలో తన పర్యటన నిమిత్తం వెళుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ ప్రమాదాన్ని గమనించి వెంటనే తన కాన్వాయ్‌ను ఆపాలని ఆదేశించారు.

క్షతగాత్రుల పరిస్థితిని చూసి చలించిన మంత్రి, తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. హుటాహుటిన 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. అంబులెన్స్ ఘటనా స్థలానికి చేరుకున్నాక, బాధితులను త్వరగా ఆసుపత్రికి తరలించేందుకు వీలుగా తన కాన్వాయ్‌లోని ప్రోటోకాల్ వాహనాన్ని అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా పంపాలని సిబ్బందిని ఆదేశించారు.

అంతటితో ఆగకుండా, ఏలూరు జిల్లా ఎస్పీకి స్వయంగా ఫోన్ చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్, గాయపడిన ఇద్దరికీ మెరుగైన వైద్యం అందేలా చూడాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. మంత్రి సమయస్ఫూర్తితో స్పందించి చేసిన సహాయం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మంత్రి తన పర్యటనను కొనసాగించారు. 

గతంలోనూ మంత్రి నాదెండ్ల ఇలాగే రోడ్డు ప్రమాద బాధితులకు సకాలంలో చికిత్స అందేలా చేసి ప్రాణాలు కాపాడారు.
Your browser does not support HTML5 video.


More Telugu News