Vallabaneni Vamsi: జైల్లో వంశీకి అస్వస్థత.. చికిత్స అనంతరం తిరిగి విజయవాడ జైలుకు తరలింపు

YCP Leader Vamsis Health Scare Hospital Visit  Return to Jail

  • విజయవాడ జైల్లో రిమాండ్‌లో ఉన్న వైకాపా నేత 
  • కాళ్ల వాపులు, శ్వాస ఇబ్బందితో ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
  • వైద్య పరీక్షల అనంతరం ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యుల నిర్ధారణ
  • బీపీ హెచ్చుతగ్గులు, ఆస్తమా వల్లే ఇబ్బంది అని స్పష్టం చేసిన డాక్టర్లు
  • వంశీ అనుచరుడు ఓలుపల్లి రంగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్  

వివిధ కేసుల విచారణలో భాగంగా విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్న వైసీపీ నేత వల్లభనేని వంశీ శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జైలు అధికారులు ఆయనను తక్షణమే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు నిర్ధారించడంతో, చికిత్స అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లారు.

శనివారం మధ్యాహ్నం సమయంలో తనకు కాళ్ల వాపులు ఉన్నాయని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉందని వంశీ జైలు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. దీంతో అప్రమత్తమైన అధికారులు తొలుత జైలు ప్రాంగణంలోనే ప్రాథమిక వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

మూడు గంటలపాటు పరీక్షలు
వంశీని ఆసుపత్రికి తీసుకువస్తున్నట్లు ముందస్తు సమాచారం లేకపోవడంతో, అప్పటికే విధులు ముగించుకుని వెళ్లిన కొంతమంది వైద్యులను ఆసుపత్రి వర్గాలు తిరిగి పిలిపించాల్సి వచ్చింది. ఈలోగా వంశీకి అత్యవసర ప్రాథమిక చికిత్సను అందించారు. ఆసుపత్రిలోని సూపర్‌స్పెషాలిటీ బ్లాక్‌లో ఉన్న కార్డియాలజీ విభాగంలో వంశీని ఉంచి, గుండె, శ్వాసకోశ నిపుణులు, జనరల్ ఫిజీషియన్ల పర్యవేక్షణలో పలు కీలక వైద్య పరీక్షలు నిర్వహించారు. 2డీ ఎకో, ఛాతీ ఎక్స్‌రే, ఈసీజీ వంటి పరీక్షలు చేసినట్లు తెలిసింది. సాయంత్రం 4:15 గంటల ప్రాంతంలో ఆసుపత్రికి తీసుకురాగా, రాత్రి 7:15 గంటల వరకు వైద్యుల పర్యవేక్షణలోనే ఈ పరీక్షల ప్రక్రియ కొనసాగింది.

బీపీ మాత్రలు మార్చడం వల్లే ఇబ్బందులు
సుమారు మూడు వారాల క్రితం బీపీ నియంత్రణకు వాడే మాత్రలు మార్చడం వల్ల రక్తపోటులో కొద్దిగా హెచ్చుతగ్గులు చోటుచేసుకున్నాయని, దీనికితోడు వంశీకి ఉన్న ఆస్తమా సమస్య కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తిందని వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాళ్ల వాపులు కూడా ఈ హెచ్చుతగ్గుల ప్రభావమే అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. వంశీకి ఎలాంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు లేవని వైద్యులు స్పష్టం చేయడంతో రాత్రి 8 గంటల సమయంలో అధికారులు ఆయనను తిరిగి విజయవాడ జైలుకు తరలించారు. థైరాయిడ్ సంబంధిత పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నందున, ఉదయం అల్పాహారం తీసుకోకముందు ఆసుపత్రికి తీసుకురావాలని వైద్యులు సూచించినట్టు సమాచారం. కాగా, నెల రోజుల క్రితం కూడా వంశీ అనారోగ్యం గురించి చెప్పడంతో జైలు అధికారులు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులను పిలిపించి పరీక్షలు చేయించినట్లు తెలిసింది.

 ఓలుపల్లి రంగా డిశ్చార్జ్ 
వంశీ ప్రధాన అనుచరుడిగా భావిస్తున్న ఓలుపల్లి మోహనరంగా శనివారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం కుదుటపడటంతో ఆయన్ను తిరిగి జైలుకు తరలించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి, సత్యవర్ధన్ కిడ్నాప్ వంటి కేసుల్లో అరెస్టయిన రంగా విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్నారు. ఈ నెల 1వ తేదీన ఆయన అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. 

Vallabaneni Vamsi
Vijayawada Jail
YCP Leader
Illness
Hospitalization
Medical Tests
Blood Pressure
Asthma
Oolu Palli Mohana Ranga
Andhra Pradesh Politics
  • Loading...

More Telugu News