మూడు ఫార్మాట్ల‌లో నేను ఎదుర్కొన్న క‌ఠిన బౌల‌ర్లు వీళ్లే: కోహ్లీ

  • టీ20ల్లో అత్యంత కఠినమైన బౌలర్‌గా సునీల్ నరైన్‌ను పేర్కొన్న కోహ్లీ
  • వన్డేలలో ల‌సిత్ మ‌లింగ‌, ఆదిల్ రషీద్ పేర్ల‌ను చెప్పిన విరాట్‌
  • టెస్టుల్లో అండర్సన్‌ అత్యంత సవాలుతో కూడిన బౌల‌ర్ అన్న ర‌న్ మెషీన్
ఈ తరం గొప్ప క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒక‌డు. అన్ని ఫార్మాట్లలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఈ టీమిండియా స్టార్ బ్యాట‌ర్‌ త‌న కెరీర్‌లో మూడు ఫార్మాట్ల‌లో తాను ఎదుర్కొన్న అత్యంత క‌ఠిన‌మైన బౌల‌ర్ల పేర్ల‌ను తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేశాడు.  

టీ20 ప్రపంచ కప్ 2024ను టీమిండియా గెల‌వ‌డంలో కోహ్లీ కీరోల్ పోషించాడు. ఇదే ఐసీసీ టోర్నీ త‌ర్వాత‌ అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలుగుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. అయితే, పొట్టి ఫార్మాట్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్‌గా వెస్టిండీస్‌ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ అని అన్నాడు. నరైన్ సంవత్సరాలుగా తనను ఇబ్బంది పెడుతున్నాడ‌ని, ఇప్పటికీ అత‌డి బౌలింగ్‌ను ఎదుర్కొవడం త‌న‌కు కష్టంగా ఉంటుంద‌ని విరాట్ పేర్కొన్నాడు.

ఇక‌, టెస్ట్ క్రికెట్ విషయానికొస్తే, ఇంగ్లాండ్ మాజీ పేసర్ జేమ్స్ అండర్సన్‌ను అత్యంత సవాలుతో కూడిన బౌల‌ర్‌గా కోహ్లీ పేర్కొన్నాడు. ముఖ్యంగా ఇంగ్లీష్ పిచ్‌ల‌పై రెడ్-బాల్ క్రికెట్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్ అండర్సన్ అని కోహ్లీ చెప్పాడు.

అలాగే వన్డేల విషయానికి వస్తే, కోహ్లీ ఇద్దరు బౌలర్లను ఎంచుకున్నాడు. శ్రీలంకకు చెందిన లసిత్ మలింగను తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న కఠినమైన పేస్‌ బౌలర్‌గా పేర్కొన్నాడు. అదే సమయంలో ఇంగ్లాండ్‌కు చెందిన ఆదిల్ రషీద్‌ను 50 ఓవర్ల ఫార్మాట్‌లో తాను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన స్పిన్నర్‌గా ర‌న్ మెషీన్ చెప్పుకొచ్చాడు.


More Telugu News