అమరావతి సభకు పోటెత్తిన జనాలు... నిండిపోయిన సభాస్థలి ప్రాంగణం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి జనసంద్రంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న రాజధాని పునఃప్రారంభ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలిరావడంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. ఈ ఉదయం నుంచే రాజధాని ప్రాంతానికి చెందిన రైతులతో పాటు, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో అమరావతికి చేరుకున్నారు. 

కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడి గ్యాలరీలన్నీ పూర్తిగా నిండిపోయాయి. వేడుకకు హాజరైన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. తాగునీరు, తాత్కాలిక ఆసుపత్రి, అంబులెన్సులను అందుబాటులో ఉంచింది.

సభా ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాకారుల ప్రదర్శనలు సభికులలో ఉత్సాహాన్ని నింపాయి. రాజధానిగా అమరావతి ప్రస్థానాన్ని పునఃప్రారంభించే ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.


Amaravati
Andhra Pradesh
Capital
reopening ceremony
farmers
cultural programs
public gathering
state government
celebration
huge crowd

More Telugu News