పీవోకేలోకి చొరబడి కొట్టడమే కాదు.. మనం అక్కడే కూర్చుండిపోవాలి: కేంద్రానికి ఒవైసీ కీలక సూచన

  • పహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఒవైసీ డిమాండ్
  • పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలు ఖాళీ చేస్తే భారత్ ఆక్రమించుకోవాలని సూచన
  • పీవోకే భారత్‌దేనన్న పార్లమెంట్ తీర్మానాన్ని గుర్తు చేసిన అసద్
  • గత ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ, దీనికి ముగింపు పలకాలని వ్యాఖ్య
  • పాక్‌పై చర్యల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ప్రకటించిన ఎంఐఎం అధినేత
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో, మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై తీవ్రంగా స్పందించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి చొరబడి దాడులు చేయటం కాదని, శాశ్వతంగా అక్కడే ఉండిపోవాలని ఆయన అభిప్రాయపడ్డారు. దాడులకు ప్రతిదాడులు చేయడం కాకుండా, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా భారత్ అడుగులు వేయాలని డిమాండ్ చేశారు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే) విషయంలో ఒవైసీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలను ఇస్లామాబాద్ ఖాళీ చేయిస్తోందన్న వార్తల నేపథ్యంలో ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. "పాకిస్తాన్ ఖాళీ చేస్తే, మనం వెళ్లి అక్కడ కూర్చోవాలి. అక్కడే ఉండిపోవాలి. ఈసారి చర్యలు తీసుకుంటే, ఇంట్లోకి చొరబడి అక్కడే తిష్ఠ వేయాలి. అంతటితో ముగించాలి" అని ఆయన ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ పేర్కొన్నారు. కేవలం దాడులు చేసి వెనక్కి రావడం కాదని, పీవోకేలో స్థిరంగా ఉండాలని ఒవైసీ అభిప్రాయపడ్డారు.

పీవోకే భారతదేశంలో అంతర్భాగమని భారత పార్లమెంట్ తీర్మానం చేసిందని ఒవైసీ గుర్తు చేశారు. "బీజేపీ నేతలు 'ఘర్ మే ఘుస్ కే మారేంగే' (ఇంట్లోకి చొరబడి కొడతాం) అంటారు. నేను 'ఘర్ మే ఘుస్ కే బైఠ్ జావో' (ఇంట్లోకి చొరబడి కూర్చోండి) అంటున్నాను. ఈ ఉగ్రవాదానికి ఇక ముగింపు పలకాలి" అని ఆయన స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్లతో పాటు ముంబై 26/11, పుల్వామా, ఉరి, పఠాన్‌కోట్, రియాసీ దాడులను ప్రస్తావిస్తూ, ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని, దీనిని ఇక ఆపాలని అన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి చెబుతున్నాయని అన్నారు.


More Telugu News