ఆయనేదో సొంత ప్రపంచంలో బ్రతుకుతున్నట్టుంది... బాబా రాందేవ్ పై ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యలు

  • రూహ్ అఫ్జాపై వ్యాఖ్యలు: యోగా గురు రామ్‌దేవ్‌పై కోర్టు ధిక్కరణ
  • గత ఆదేశాల ఉల్లంఘన: ఢిల్లీ హైకోర్టు ప్రాథమిక నిర్ధారణ
  • అభ్యంతరకర వీడియో ప్రచురణపై కోర్టు ఆగ్రహం
  • "ఆయన ఎవరి నియంత్రణలో లేరు": జస్టిస్ అమిత్ బన్సల్ వ్యాఖ్య
  • హమ్‌దర్ద్ ఫౌండేషన్ పిటిషన్‌పై విచారణ సందర్భంగా పరిణామం
యోగా గురు బాబా రామ్‌దేవ్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హమ్‌దర్ద్ సంస్థకు చెందిన 'రూహ్ అఫ్జా' శీతల పానీయంపై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించారని గురువారం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో, ఆయనపై ప్రాథమికంగా కోర్టు ధిక్కరణ కేసు నమోదు చేయాల్సి వస్తుందని జస్టిస్ అమిత్ బన్సల్ హెచ్చరించారు. విచారణ సందర్భంగా రామ్‌దేవ్ తీరుపై, "ఆయన (రామ్‌దేవ్) ఎవరి నియంత్రణంలో లేరు... ఆయనేదో తన సొంత లోకంలో జీవిస్తున్నట్టుంది" అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

పతంజలికి చెందిన గులాబ్ షర్బత్‌ను ప్రమోట్ చేస్తూ, రూహ్ అఫ్జాపై రామ్‌దేవ్ 'షర్బత్ జిహాద్' తరహా వ్యాఖ్యలు చేశారని, ఆ పానీయం లాభాలను మతపరమైన కార్యకలాపాలకు వాడుతున్నారని ఆరోపించారని హమ్‌దర్ద్ నేషనల్ ఫౌండేషన్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాఖ్యలు మత సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

గతంలో ఈ వ్యాఖ్యలను "సమర్థించలేనివి" అని పేర్కొన్న హైకోర్టు, హమ్‌దర్ద్ ఉత్పత్తుల గురించి అభ్యంతరకర ప్రకటనలు చేయరాదని ఏప్రిల్ 22న రామ్‌దేవ్‌ను స్పష్టంగా ఆదేశించింది. వివాదాస్పద కంటెంట్‌ను తొలగిస్తానని రామ్‌దేవ్ అప్పట్లో కోర్టుకు హామీ కూడా ఇచ్చారు.

అయితే, ఈ ఆదేశాలను, ఇచ్చిన హామీని బేఖాతరు చేస్తూ రామ్‌దేవ్ ఇటీవల మళ్లీ అభ్యంతరకర వీడియోను ప్రచురించినట్లు కోర్టు గుర్తించింది. "గత ఆదేశాలు, ఆయన అఫిడవిట్, తాజా వీడియోను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది ప్రాథమికంగా కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది" అని జస్టిస్ బన్సల్ స్పష్టం చేశారు. తాను ఏ బ్రాండ్ పేరు ప్రస్తావించలేదని రామ్‌దేవ్ గతంలో వాదించారు.

ఇదే వ్యవహారంపై మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ ఇటీవల రామ్‌దేవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.




More Telugu News