Lalu Prasad Yadav: కులగణనపై కేంద్రం నిర్ణయం.. స్పందించిన ఆర్జేడీ, కాంగ్రెస్

రానున్న జనాభా గణనలో కులాల వారీగా వివరాలు సేకరిస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో, ఈ ఘనత తమదేనంటూ కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీలు ప్రకటించాయి. బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కేంద్రం ఈ దిశగా అడుగులు వేయడం తమ రాజకీయ విజయంగా ఆ పార్టీలు పేర్కొంటున్నాయి.

కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఢిల్లీలో ఈ ప్రకటన చేసిన అనంతరం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ స్పందించారు. "రిజర్వేషన్లు, కుల గణన, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికవాదం వంటి అంశాలపై సోషలిస్టులమైన మేము 30 ఏళ్ల క్రితమే ఆలోచిస్తే.. ఇతరులు దశాబ్దాల తర్వాత అనుసరిస్తున్నారు" అని ఆయన అన్నారు. "కుల గణనను డిమాండ్ చేసినప్పుడు మమ్మల్ని 'కులతత్వవాదులు' అని విమర్శించిన వారికి ఇది గట్టి సమాధానం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. సంఘీలను మా అజెండా ప్రకారమే నడిపిస్తాం" అని లాలూ పేర్కొన్నారు.

లాలూ కుమారుడు, ఆర్జేడీ సీనియర్ నేత తేజస్వి యాదవ్ కూడా దీనిని తమ విజయంగా అభివర్ణించారు. "ఇది మాకు గొప్ప విజయం. ప్రధాని నరేంద్ర మోదీ కుల గణనను వ్యతిరేకించారు. కానీ కేంద్రం ఇప్పుడు మా అజెండా ప్రకారమే పనిచేస్తోంది" అని తేజస్వి యాదవ్ అన్నారు. బీహార్‌లో మహాకూటమి ప్రభుత్వం ఇదివరకే కులాల వారీగా గణాంకాలను సేకరించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

మరోవైపు, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పరిణామంపై హర్షం వ్యక్తం చేసింది. కులాల వారీగా గణాంకాలను సేకరించాలన్నది తమ పార్టీ చిరకాల డిమాండ్ అని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం తమ పోరాట ఫలితమేనని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
Lalu Prasad Yadav
Tejashwi Yadav
Congress
RJD
Caste Census
India
Bihar Elections
Reservation
Aswini Vaishnaw
Modi

More Telugu News