పహల్గామ్ దాడి.. జాతీయ భద్రతా సలహా బోర్డుపై కేంద్రం కీలక నిర్ణయం

  • జాతీయ భద్రతా సలహా బోర్డును పునర్‌వ్యవస్థీకరించిన కేంద్రం
  • బోర్డుకు నూతన చైర్మన్‌గా 'రా' మాజీ అధిపతి అలోక్ జోషి నియామకం
  • మరో ఆరుగురు సభ్యులతో బోర్డు విస్తరణ
  • మాజీ సైనిక, పోలీసు అధికారులకు బోర్డులో చోటు
దేశ భద్రతా యంత్రాంగాన్ని పటిష్టం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా బోర్డు (ఎన్‌ఎస్‌ఏబీ)ను కేంద్ర ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరించింది. ఈ బోర్డుకు నూతన ఛైర్మన్‌గా రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (‘రా’) మాజీ అధిపతి అలోక్‌ జోషిని నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇటీవలే జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి జరిగిన నేపథ్యంలో, దేశ భద్రతకు సంబంధించిన ఈ కీలక నియామకం ప్రాధాన్యతను సంతరించుకుంది.

భద్రతా వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ (సీసీఎస్) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అలోక్‌ జోషితో పాటు మరో ఆరుగురు మాజీ ఉన్నతాధికారులను బోర్డులో సభ్యులుగా నియమించారు. వీరిలో వైమానిక దళానికి చెందిన మాజీ అధికారి ఎయిర్‌ మార్షల్ పీఎం సిన్హా, సైన్యానికి చెందిన రిటైర్డ్ లెఫ్టినెంట్‌ జనరల్‌ ఏకే సింగ్‌, నౌకాదళ మాజీ అధికారి అడ్మిరల్‌ మోంటీ ఖన్నా ఉన్నారు.

వీరితో పాటు మాజీ ఐపీఎస్‌ అధికారులు రాజీవ్‌ రంజన్‌ వర్మ, మన్మోహన్‌ సింగ్‌, మాజీ దౌత్యవేత్త బి. వెంకటేశ్‌ వర్మలను కూడా సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ నియామకాల ద్వారా వివిధ రంగాల్లో అనుభవజ్ఞులైన నిపుణులను భద్రతా సలహా బోర్డులోకి తీసుకువచ్చినట్లయింది.

ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడికి ప్రతిస్పందన విషయంలో పూర్తి స్వేచ్ఛను భద్రతా బలగాలకే ఇస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలనేదే జాతీయ సంకల్పమని, దానిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భద్రతా యంత్రాంగానికి మరింత పదును పెట్టే చర్యల్లో భాగంగానే ఎన్‌ఎస్‌ఏబీ పునర్‌వ్యవస్థీకరణ జరిగిందని తెలుస్తోంది.


More Telugu News