ప్రపంచంలో మా పరిస్థితి ఇదే: పాక్ నటి సభా కమర్ వ్యాఖ్యలు

  • మమ్మల్ని వేరుగా చూస్తున్నారన్న పాక్ నటి సభా కమర్ 
  • తన పాస్ పోర్టు చూసి ఆపేశారని వెల్లడి 
  • ప్రపంచంలో ఎక్కడకు వెళ్లినా అవమానాలు తప్పడం లేదని వ్యాఖ్య
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రపంచ దేశాలు భారత్‌కు అండగా నిలుస్తున్నాయి. ఈ దాడిని ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీని ఫలితంగా పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాక్‌పై కఠిన ఆంక్షలు విధిస్తోంది.

ఈ తరుణంలో పాక్ నటి సభా కమర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. గతంలో తనకెదురైన అవమానాలను గుర్తు చేసుకుని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తమ దేశస్థులు ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా అవమానాలు తప్పడం లేదని, అందరూ తమను వేరుగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకసారి షూటింగ్ నిమిత్తం తాను జార్జియాలోని టిబిలిసికి వెళ్లినప్పుడు, విమానాశ్రయంలో భారతీయులందరినీ పంపించారని, అయితే తన పాస్‌పోర్ట్ చూడగానే ఆపేశారని ఆమె గుర్తు చేసుకున్నారు. తాను పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తినని తెలియగానే అనేక ప్రశ్నలు అడిగిన తర్వాతే అనుమతించారని ఆమె తెలిపారు. ఆ సమయంలో తనకు ఎంతో అవమానంగా అనిపించిందని ఆమె అన్నారు.

తమ దేశంలో పాకిస్థాన్ జిందాబాద్ అని నినదిస్తామని, కానీ ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తమ పరిస్థితి ఏమిటో తెలుస్తోందని ఆమె వాపోయారు. ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటున్నానని ఆమె భావోద్వేగంతో అన్నారు. సభా కమర్ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు స్పందిస్తూ, ఇతర దేశాల వారిపై దాడులు చేస్తే ఇలాగే చూస్తారని కామెంట్లు పెడుతున్నారు. 


More Telugu News