ఆ హంతకులలో నా కొడుకు ఉంటే కాల్చి చంపండి.. టెర్రరిస్ట్ ఆదిల్ తల్లి

  • 2018 లో ఇంటి నుంచి వెళ్లిపోయాడని వెల్లడి
  • తన కొడుకు ఆ పని చేసి ఉండడని అంటున్న షాజాదా బానో
  • ఆదిల్ కోసం భద్రతా బలగాల వేట.. లొంగిపొమ్మంటూ బానో విజ్ఞప్తి
  • గురీ గ్రామంలోని ఆదిల్ ఇంటిని కూల్చివేసిన భద్రతా బలగాలు
పహల్గామ్ లో ఉగ్రదాడికి పాల్పడిన నరహంతకులలో తన కొడుకు ఉంటే అతడిని అదేచోట కాల్చి చంపేయాలని ఉగ్రవాది ఆదిల్ హుస్సేన్ థోకర్ తల్లి షాజాదా బానో అన్నారు. పోలీసులకు లొంగిపొమ్మంటూ ఆదిల్ కు ఆమె సూచించారు. ‘లొంగిపో బిడ్డా.. అందరం ప్రశాంతంగా బతుకుదాం’ అంటూ మీడియా ద్వారా కొడుకుకు విజ్ఞప్తి చేశారు. ఉగ్రదాడి తర్వాత ఆదిల్ ను వెతుక్కుంటూ భద్రతా బలగాలు తన ఇంటికి రావడం, సోదాలు జరిపి ఇంటిని కూల్చేయడంపై షాజాదా స్పందించారు. 2018లో పరీక్ష రాసివస్తానని వెళ్లిన ఆదిల్ ఇప్పటి వరకూ రాలేదని చెప్పారు. అప్పట్లో ఆదిల్ కనిపించడం లేదని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. ఉగ్రదాడి చేసిన వారిలో తన కొడుకు ఉండకపోవచ్చని అన్నారు. అధికారులు విడుదల చేసిన స్కెచ్‌లు తన కుమారుడి పోలికలతో సరిపోలడం లేదని పేర్కొన్నారు. ఆదిల్ శ్రద్ధగా చదువుకునేవాడని స్థానికులు గుర్తుచేసుకున్నారు.  

2018లో ఆదిల్ పాకిస్థాన్‌కు వెళ్లాడని, స్టడీ వీసాపై అక్కడికి వెళ్లి ఉగ్రవాదులతో కలిశాడని నిఘా వర్గాలు చెబుతున్నాయి. 2024లో నియంత్రణ రేఖ ద్వారా తిరిగి భారత్‌లోకి ప్రవేశించి ఉంటాడని అధికారులు భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో ఆదిల్ తండ్రి వలీమ్ మొహమ్మద్ థోకర్, సోదరులు జాహిర్, అర్ష్‌లామ్, కజిన్‌లు జులంకర్, సజ్జాద్‌లను భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. తన భర్త, కుమారులు నిర్బంధంలో ఉన్నారని, ఇల్లు కూలిపోయిందని, ఇప్పుడు తన పరిస్థితి ఏమిటని షాజాదా బానో విలపించారు.


More Telugu News