పహల్గామ్ ఉగ్రదాడి... పాకిస్థాన్ ప్రధానమంత్రి వ్యాఖ్యలకు ఒమర్ అబ్దుల్లా కౌంటర్

పహల్గామ్‌లో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రదాడి ఘటనపై నిష్పాక్షిక దర్యాప్తునకు సిద్ధంగా ఉన్నామంటూ పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ చేసిన ప్రకటనపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని ఆయన తప్పుబడుతూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఈ దాడి జరిగినప్పుడు పాకిస్థాన్ కనీసం దానిని గుర్తించలేదని, పైగా ఘటన వెనుక భారత్ హస్తం ఉందంటూ నిందలు వేసిందని ఒమర్ అబ్దుల్లా గుర్తుచేశారు. "పహల్గామ్‌లో జరిగిన ఆ పాశవిక ఘటనను వారు మొదట గుర్తించనైనా లేదు. ఘటన వెనుక భారత్ ఉందని ఆరోపించారు. మనపై నిందలు వేయడంలో ముందుండే వారికి మేమేమి చెప్పగలం? వారి ప్రకటనలకు మేం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వాలనుకోవడం లేదు. ఆ దురదృష్టకర ఘటన జరిగి ఉండాల్సింది కాదు" అని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు.

అంతకుముందు, పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో జరిగిన ఓ సైనిక అకాడమీ స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని షెహబాజ్ షరీఫ్ పహల్గామ్ దాడి అంశాన్ని ప్రస్తావించారు. 

"పహల్గామ్‌లో ఇటీవల జరిగిన విషాదకర ఘటన కారణంగా మా దేశం మరోసారి నిందలు ఎదుర్కొంటోంది. ఈ ఘటనపై నిష్పాక్షికమైన, పారదర్శకమైన, విశ్వసనీయమైన దర్యాప్తులో పాలుపంచుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. శాంతికే మా తొలి ప్రాధాన్యత" అని షరీఫ్ తెలిపారు. ఉగ్రవాదాన్ని తాము కూడా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రకటనపైనే ఒమర్ అబ్దుల్లా పైవిధంగా విమర్శలు చేశారు.

Omar Abdullah
Pakistan Prime Minister
Shehbaz Sharif
Pahalgam Terrorist Attack
Jammu and Kashmir
Terrorism in India
India-Pakistan Relations
National Conference
Neutral Investigation
Counter Terrorism

More Telugu News