ముంబై దాడుల్లో నా పాత్ర లేదు... ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణలో తహవ్వుర్ రాణా

  • ముంబై 26/11 దాడుల కేసులో నిందితుడు తహవ్వుర్ రాణాను విచారించిన పోలీసులు 
  • దాడుల కుట్రలో తన ప్రమేయం లేదని ఖండన
  • సహ నిందితుడు డేవిడ్ హెడ్లీదే పూర్తి బాధ్యత అని ఆరోపణ
  • విచారణకు సహకరించని రాణా, జ్ఞాపకశక్తి లోపమన్న వాదన
  • కేరళ పర్యటనపైనా పోలీసుల ఆరా
ముంబైలో 2008 నవంబర్ 26న జరిగిన ఘోర ఉగ్రదాడి కుట్రలో తన ప్రమేయం ఏమాత్రం లేదని తహవ్వుర్ రాణా స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఢిల్లీలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కస్టడీలో ఉన్న రాణాను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసుల బృందం సుదీర్ఘంగా ప్రశ్నించింది.

సుమారు ఎనిమిది గంటల పాటు జరిగిన ఈ విచారణలో, 166 మందికి పైగా ప్రాణాలను బలిగొన్న ఆ దాడుల ప్రణాళికలో గానీ, వాటి అమలులో గానీ తనకు సంబంధం లేదని రాణా చెప్పినట్లు సీనియర్ అధికారులు తెలిపారు. తన చిన్ననాటి స్నేహితుడు, ఈ కేసులో మరో నిందితుడైన డేవిడ్ కోల్‌మన్ హెడ్లీనే రెక్కీ నిర్వహించడం, దాడులకు పథకం రచించడం వంటి అంశాలకు పూర్తిగా బాధ్యుడని రాణా ఆరోపించాడు. లష్కరే తోయిబా తరఫున ముంబై సహా భారత్‌లోని పలు ప్రాంతాల్లో తాను రెక్కీ నిర్వహించినట్లు హెడ్లీ గతంలో అంగీకరించిన విషయం తెలిసిందే.

విచారణ సందర్భంగా తాను ముంబై, ఢిల్లీతో పాటు కేరళకు కూడా వెళ్లానని రాణా వెల్లడించాడు. కేరళ పర్యటన ఉద్దేశం గురించి ప్రశ్నించగా, తనకు తెలిసిన వ్యక్తిని కలిసేందుకే వెళ్లానని, ఆ వ్యక్తి పేరు, చిరునామా వివరాలను కూడా దర్యాప్తు సంస్థకు అందించానని చెప్పాడు. ఈ నేపథ్యంలో రాణా చెప్పిన విషయాలను ధృవీకరించుకునేందుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ బృందం త్వరలో కేరళ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

అయితే, విచారణ సమయంలో రాణా పెద్దగా సహకరించలేదని, తరచూ పొంతనలేని సమాధానాలు ఇచ్చాడని అధికారులు పేర్కొన్నారు. చాలా సంవత్సరాల క్రితం జరిగిన దాడికి సంబంధించిన నిర్దిష్ట వివరాలు తనకు గుర్తులేవంటూ జ్ఞాపకశక్తి లోపాన్ని కారణంగా చూపినట్లు సమాచారం. ముంబై దాడులకు ముందు లష్కరే తోయిబా, పాకిస్థాన్ ఐఎస్ఐ సాగించిన కుట్రపై ఎన్ఐఏ చేస్తున్న విస్తృత దర్యాప్తులో భాగంగానే ఈ విచారణ జరుగుతోంది.

26/11 కుట్రలో కీలకపాత్ర పోషించారని భావిస్తున్న అబ్దుర్ రెహ్మాన్ హషీమ్ సయ్యద్, సాజిద్ మజీద్, ఇలియాస్ కశ్మీరీ, జాకీ-ఉర్-రెహ్మాన్ లఖ్వీ వంటి పలువురితో రాణాకు ఉన్న సంబంధాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. పాకిస్థాన్ ఆర్మీ మెడికల్ కోర్ లో మాజీ అధికారి అయిన రాణాను, ముంబై దాడుల కేసులో విచారించేందుకు ఇటీవలే అమెరికా నుంచి భారత్‌కు తీసుకొచ్చారు.


More Telugu News