ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి.. పిల్లాడిని కిందకు దింపమని చెప్పి.. క‌ర్ణాట‌క వ్య‌క్తిపై 3 నిమిషాల పాటు కాల్పులు

  • ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడి మృతుల్లో బెంగ‌ళూరు వాసి భ‌ర‌త్ భూష‌ణ్‌
  • ఈ నెల 18న భార్య‌, కుమారుడితో క‌లిసి కశ్మీర్‌కు వెళ్లిన ఫ్యామిలీ
  • హిందువులం అని చెప్పగానే భ‌ర‌త్‌పై తూటాల వ‌ర్షం కురిపించిన ఉగ్ర‌వాదులు
  • ఆ స‌మ‌యంలో అత‌డి చేతిలో మూడేళ్ల త‌న కుమారుడు
  • పిల్లాడిని కింద‌కు దింప‌మ‌ని చెప్పి.. చనిపోయేవ‌ర‌కు 3 నిమిషాల పాటు కాల్పులు
పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో మృతిచెందిన‌ సంద‌ర్శ‌కులలో బెంగళూరు వాసి భరత్‌ భూషణ్‌ ఒకరు. ఆ సమయంలో ఆయన పక్కనే ఉన్న భార్య సుజాత, మూడేళ్ల కుమారుడిని మాత్రం ఉగ్ర‌వాదులు విడిచిపెట్టారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన భరత్‌ బెంగళూరులోని మతికెరె ప్రాంతంలో ఉన్న తన కుటుంబానికి చెందిన డయాగ్నస్టిక్ కేంద్రాన్ని చూసుకునేందుకు ఇటీవలే జాబ్‌కు రిజైన్‌ చేశారు.

ఈ నెల‌ 18న తన భార్య, కుమారుడితో కలిసి విహార‌యాత్ర కోసం కశ్మీర్‌కు వెళ్లిన భరత్‌... ఏప్రిల్‌ 23న బెంగళూరుకు తిరిగి రావలసి ఉందని అత‌ని అత్త విమల తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం తన కుమార్తె ఫోన్‌ చేసి జరిగిన దారుణాన్ని తెలియజేసిందని ఆమె తెలిపారు. 

తన కుమార్తె తెలిపిన వివరాల ప్రకారం... ముష్క‌రులు మొద‌ట వారికి ఆధార్‌ కార్డులు చూపించమని అడిగారని ఆమె చెప్పారు. అలాగే 'మీరు ముస్లింలా లేక హిందువులా' అని అడిగార‌ట‌. హిందువులం అని చెప్పగానే భ‌ర‌త్‌ను కాల్చివేశార‌ని తన కుమార్తె చెప్పినట్లు విమ‌ల‌ తెలిపారు. 

ఆ స‌మ‌యంలో తన అల్లుడి చేతిలో మూడేళ్ల పిల్లాడు ఉన్నాడని, పిల్లాడిని కిందకు దింపమని చెప్పి కాల్పులు జరిపారని ఆమె వివరించారు. ముస్లిం అయితే మిమల్ని విడిచిపెడతాం అని ఉగ్రవాదులు వారితో అన్నారని, హిందువని నిర్ధారించుకున్న తర్వాత తలపై కాల్పులు జరిపారని విమ‌ల‌ తెలిపారు.

ఏకంగా మూడు నిమిషాల పాటు తన అల్లుడిపై కాల్పులు జరిపిన‌ట్లు ఆమె పేర్కొన్నారు. చ‌నిపోయేంతవరకు కాల్పులు జరిపారని, చివరిగా తలపై కాల్చారని విమల చెప్పారు. ఈ ఘ‌ట‌న త‌మను తీవ్రంగా క‌లిచివేసింద‌ని, కూతురు, అల్లుడు ఆనందంగా తిరిగొస్తార‌ని ఆశ‌ప‌డ్డ త‌మ‌కు ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని విషాదం మిగిలింద‌ని ఆమె వాపోయారు.  




More Telugu News