Revanth Reddy: జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న రేవంత్ రెడ్డి, బృందం

- శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం
- ఈ నెల 16న జపాన్ పర్యటనకు వెళ్లిన బృందం
- వివిధ కంపెనీలతో పెట్టుబడులకు ఒప్పందాలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ నెల 16వ తేదీన రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనకు వెళ్లింది.
అక్కడ వివిధ కంపెనీలతో సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. ఈ క్రమంలో రూ. 12,062 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పెట్టుబడుల ద్వారా తెలంగాణ యువతకు సుమారు 35,000 ఉద్యోగ అవకాశాలు వస్తాయని ప్రభుత్వం తెలిపింది.
జపాన్కు చెందిన మారుబెని కంపెనీ హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండిస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు ఒప్పందం చేసుకుంది. రూ. 1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఎన్టీటీ డేటా, నెయిసా సంస్థలతోనూ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థలు రూ. 10,500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటు చేయనున్నాయి.