పీఎస్ఆర్ ఆంజనేయులును రేపు కోర్టులో ప్రవేశపెట్టనున్న సీఐడీ అధికారులు

  • జత్వానీ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్ట్
  • విజయవాడ సీఐడీ కార్యాలయంలో విచారణ
  • దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించిన సీఐడీ అధికారులు
ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ముంబై నటికి సంబంధించిన కేసులో ఆయన్ను మంగళవారం ఉదయం అరెస్ట్ చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా విజయవాడలోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో అధికారులు ఆయనను లోతుగా ప్రశ్నించారు.

ఉదయం ప్రారంభమైన విచారణ సుమారు ఏడు గంటల పాటు కొనసాగినట్లు సమాచారం. విచారణ సందర్భంగా ఈ కేసుకు సంబంధించి పలు కీలక పత్రాలను కూడా సీఐడీ అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రికి ఆంజనేయులును సీఐడీ కార్యాలయంలోనే ఉంచి, బుధవారం ఉదయం కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా, పీఎస్‌ఆర్ ఆంజనేయులుపై మరో కేసు కూడా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారన్న ఆరోపణలపై గుంటూరులోని సీఐడీ పోలీస్ స్టేషన్‌లో కొత్తగా కేసు నమోదు చేసినట్లు తెలిసింది. ఈ రెండు కేసులకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోంది.


More Telugu News