Revanth Reddy: వక్ఫ్ ఆస్తులు కొల్లగొట్టిన బడా చోర్ నేతలకు రేవంత్ మద్దతు ఇస్తున్నారు: బండి సంజయ్

- వక్ఫ్ బిల్లుకు వ్యతిరేక ఆందోళనల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపణ
- మత కల్లోలాలు జరగాలని కాంగ్రెస్ చూస్తోందని బండి సంజయ్ ఆగ్రహం
- వక్ఫ్ ఆస్తులను మజ్లిస్ పార్టీ దోచుకుందని వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ధ్వజమెత్తారు. వక్ఫ్ ఆస్తులు కొల్లగొట్టిన బడా చోర్ నేతలకు రేవంత్ రెడ్డి మద్దతు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ఆరోపించారు. మత కల్లోలాలు జరగాలని కాంగ్రెస్ చూస్తోందని మండిపడ్డారు. వక్ఫ్ ఆస్తులను మజ్లిస్ పార్టీ దోచుకుందని, వక్ఫ్ భూములతో ముస్లింలకు ఏం లాభం చేకూర్చారో చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు.
మరోవైపు, సీఎం రేవంత్ రెడ్డి జపాన్ లో పర్యటిస్తుండడం పట్ల బండి సంజయ్ విమర్శనాస్త్రాలు సంధించారు. అకాల వర్షాలతో రైతులు కష్టాల్లో ఉంటే రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలా? అని మండిపడ్డారు. లక్ష కోట్లు తెస్తామని చెప్పడమే తప్ప ఎక్కడా ఆచరణలో కనిపించడం లేదని విమర్శించారు.