Mithun Reddy: మిథున్ రెడ్డిని 8 గంటల పాటు ప్రశ్నించిన సిట్ అధికారులు

- ఏపీలో లిక్కర్ స్కాం ప్రకంపనలు
- విచారణ ముమ్మరం చేసిన సిట్
- మిథున్ రెడ్డిని పలు కోణాల్లో ప్రశ్నించిన సిట్
ఏపీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అనుసరించిన మద్యం విధానం, ధరల నిర్ణయం, బ్రాండ్ల ఎంపిక, మద్యం సరఫరాదారులతో కుమ్మక్కు వంటి ఆరోపణలపై సిట్ దృష్టి సారించింది. ఈ క్రమంలో పలువురు కీలక వ్యక్తులను విచారిస్తోంది.
ఈ క్రమంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి నేడు విజయవాడలోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నించారు. శనివారం ఉదయం సిట్ కార్యాలయానికి చేరుకున్న మిథున్ రెడ్డిని, అధికారులు దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు. ఈ సుదీర్ఘ విచారణలో భాగంగా, మద్యం కుంభకోణానికి సంబంధించిన పలు కీలక అంశాలపై, ముఖ్యంగా కొన్ని డిస్టిలరీలకు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలపై సిట్ అధికారులు ఆయన్ను ప్రశ్నించినట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా రాజ్ కసిరెడ్డికి చెందిన ఆదాన్ డిస్టిలరీ, డికార్ట్ నుంచి ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ చేసిన కొనుగోళ్లు... రాజ్ కసిరెడ్డితోనూ, ఆయన అనుచరులు చాణక్యరాజ్, అవినాశ్ రెడ్డిలతో ఉన్న సంబంధాలపైనా మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. వారితో ఆర్థిక లావాదేవీలపైనా కూపీ లాగే ప్రయత్నం చేశారు. అయితే మిథున్ రెడ్డి కొన్ని ప్రశ్నలకే సమాధానం చెప్పినట్టు సమాచారం.
విచారణ అనంతరం మిథున్ రెడ్డి నుంచి స్టేట్మెంట్ను రికార్డు చేసి, దానిపై ఆయన సంతకాన్ని తీసుకున్నారు. కోర్టు ఆదేశాల మేరకు మిథున్ రెడ్డిని న్యాయవాది సమక్షంలో విచారించారు.