వ్యభిచారం కేసు పెడతానని కృష్ణవేణిని సీఐ బెదిరించారు: అంబటి రాంబాబు

  • వెంకయ్యనాయుడు, లోకేశ్ పై కృష్ణవేణి అనుచిత పోస్టులు
  • గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న కృష్ణవేణి
  • కృష్ణవేణి పట్ల దాచేపల్లి సీఐ దారుణంగా వ్యవహరించారన్న అంబటి
భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రి నారా లోకేశ్ లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ పాలేటి కృష్ణవేణి ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఉన్న కృష్ణవేణిని ములాఖత్ ద్వారా వైసీపీ నేతలు అంబటి రాంబాబు, దొంతిరెడ్డి వేమారెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు కలిశారు. 

అనంతరం మీడియాతో అంబటి రాంబాబు మాట్లాడుతూ... పాలేటి కృష్ణవేణి పట్ల దారుణంగా వ్యవహరించిన దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ పై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయంత్రం 5 గంటలకు కృష్ణవేణిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి దాచేపల్లికి తీసుకెళ్లారని... మరుసటి రోజు ఉదయం వరకు స్టేషన్ లోనే ఉంచి కనీసం ఆహారం కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. 

కృష్ణవేణి పట్ల సీఐ భాస్కర్ అసభ్యకరంగా మాట్లాడారని అంబటి అన్నారు. వైసీపీ నేతల పేర్లు చెప్పమని కృష్ణవేణిని హింసించారని... చెప్పినట్టు వినకపోతే కృష్ణవేణి భర్తపై గంజాయి కేసు పెడతానని బెదిరించారని మండిపడ్డారు. కృష్ణవేణిపై వ్యభిచారం కేసు కూడా పెడతానని భయపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వ్యభిచారం కేసు పెడతానని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. సీఐపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


More Telugu News