Bhumana Karunakar Reddy: ఇలాంటివి మరో 100 కేసులు పెట్టినా భయపడను: భూమన కరుణాకర్ రెడ్డి

- టీటీడీ గోశాలలో ఆవులు చనిపోయాయని తప్పుడు ప్రచారం చేశారంటూ భూమనపై కేసు
- విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేశానన్న భూమన
- ఏ తప్పు జరిగినా ప్రశ్నిస్తూనే ఉంటానని వ్యాఖ్య
టీటీడీ గోశాలలో వందకు పైగా గోవులు చనిపోయాయని అసత్య ప్రచారం చేశారంటూ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. బీజేపీ నేత, టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలో భూమన మాట్లాడుతూ... ఒక్క కేసు కాదు, ఇలాంటివి మరో 100 కేసులు పెట్టుకున్నా తాను భయపడనని అన్నారు. వ్యక్తిగత దాడులు, వ్యక్తిత్వ హననాలు చేస్తే భయపడతాం అనుకుంటే అది మీ భ్రమ మాత్రమేనని చెప్పారు. మీ తప్పులను ఎత్తి చూపుతూనే ఉంటానని... ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మీరు పెట్టే కేసుల వల్ల తాను ధర్మం వైపు నిలబడకపోవడం అనేది జరగదని భూమన అన్నారు. విద్యార్థి దశ నుంచే పోరాటాలు చేశానని... ఏ తప్పు జరిగినా తాను నిలదీస్తూనే ఉంటానని చెప్పారు.
తప్పుడు హామీలు ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చారని... 10 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని అన్నారు. మీ పాలనలో జరిగే తప్పులను ప్రశ్నించకపోతే అది పాపం అవుతుందని వ్యాఖ్యానించారు. దేవుడిని అడ్డం పెట్టుకుని మీరు చేస్తున్న రాజకీయాలను హిందువులు, రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.