Vijay Sai Reddy: ఎట్టకేలకు సిట్ కార్యాలయంలో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి

- ఏపీలో ప్రకంపనలు రేపుతున్న లిక్కర్ స్కాం
- ఈ స్కాంలో రాజ్ కసిరెడ్డి కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయి వ్యాఖ్యలు
- సాక్షిగా విచారణకు రావాలంటూ సిట్ నోటీసులు
ఏపీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ మధ్యాహ్నం విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఏపీ మద్యం కుంభకోణానికి రాజ్ కసిరెడ్డి కీలక సూత్రధారి అని ఇటీవల విజయసాయి ఓ ప్రెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మద్యం కుంభకోణం కేసులో సాక్షిగా విచారణకు హాజరుకావాలని విజయసాయిరెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు.
వాస్తవానికి ఇవాళ (ఏప్రిల్ 18) విచారణకు రావాలంటూ సిట్ అధికారులు విజయసాయిరెడ్డికి నోటీసులు పంపారు. అయితే, ఏప్రిల్ 18న తనకు కొన్ని పనులు ఉన్నాయని, ఒక రోజు ముందే విచారణకు వస్తానని, ఏప్రిల్ 17వ తేదీని విజయసాయిరెడ్డే ప్రతిపాదించారు. దాంతో ఆయన వస్తారని విజయవాడ సిట్ కార్యాలయంలో నిన్న అన్ని ఏర్పాట్లు చేశారు.
అయితే, విజయసాయి నిన్న విచారణకు హాజరుకాలేదు. ఏప్రిల్ 18నే విచారణకు వస్తానని అనంతరం సిట్ అధికారులకు తెలియజేశారు. ఆ ప్రకారమే ఇవాళ విచారణకు హాజరయ్యారు.