విజయవాడ బస్టాండ్ దగ్గర మంటల్లో పూర్తిగా కాలిపోయిన ట్రావెల్స్ బస్సు

  • అగ్నిప్రమాదానికి గురైన ఏవీఆర్ ట్రావెల్స్ బస్సు
  • కొద్ది సేపట్లోనే బస్సు దగ్ధం
  • షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చని అనుమానం
విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టాండ్ సమీపంలో ఆగి ఉన్న ఒక ప్రైవేట్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఏవీఆర్ ట్రావెల్స్‌కు చెందిన ఈ బస్సులో ప్రమాద సమయంలో ప్రయాణికులు గానీ, సిబ్బంది గానీ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో బస్టాండ్ పరిసరాల్లో కొద్దిసేపు భయాందోళన నెలకొంది.

సమాచారం ప్రకారం, బస్టాండ్ సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో నిలిపి ఉంచిన ఏవీఆర్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు బస్సు మొత్తానికి వేగంగా వ్యాపించాయి. దట్టమైన పొగలు పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే మంటలను అదుపులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. అయితే, వారు రంగంలోకి దిగేలోపే బస్సు చాలా వరకు కాలిపోయింది.

ఈ అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. బస్సులోని ఎలక్ట్రికల్ వ్యవస్థలో ఏర్పడిన లోపం వల్ల మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు. 


More Telugu News