Mahesh Kumar Goud: ఆ వీడియోలను చూసి మోదీ పొరబడ్డారు: మహేశ్ కుమార్ గౌడ్

- ఏఐ ఫేక్ వీడియోలు అని తెలిశాక కిషన్ రెడ్డి తొలగించారని వెల్లడి
- 400 ఎకరాల భూమిని ప్రైవేటుపరం చేసే ఆలోచన లేదన్న టీపీసీసీ చీఫ్
- సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శ
కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఫేక్ వీడియోలను చూసి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పొరపాటుపడ్డారని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. అవి నకిలీ వీడియోలని వెల్లడైన తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 'ఎక్స్'లో ఉంచిన వీడియోలను తొలగించారని తెలిపారు.
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ప్రైవేటీకరణ చేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ అవుతాయని భావించిన భూములను కాంగ్రెస్ ప్రభుత్వం పరిరక్షించిందని అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టూ వేల ఎకరాల భూములను విక్రయించిందని ఆరోపించారు. కేటీఆర్ తన అనుచరులకు వేలాది ఎకరాలు కట్టబెట్టారని విమర్శించారు. ఎకరం రూ. 100 కోట్లు పలికే భూములను కూడా రూ. 30 లక్షలకే విక్రయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు పలుమార్లు మొట్టికాయలు వేసిందని గుర్తు చేశారు.