Ramaiah: రామయ్య మరణం తెలంగాణకు తీరని లోటు: బండి సంజయ్

- గుండెపోటు కారణంగా వనజీవి రామయ్య మృతి
- రామయ్య మృతిపై విచారం వ్యక్తం చేసిన బండి సంజయ్
- జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలు నాటారని కితాబు
తన జీవితాన్ని మొక్కలు నాటడానికే అంకితం చేసిన వనజీవి రామయ్య గుండెపోటుతో మరణించారు. ఆయన మృతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ విచారం వ్యక్తం చేశారు. తన జీవిత కాలంలో కోటికి పైగా మొక్కలను నాటి, పర్యావరణ పరిరక్షణకు అపారమైన సేవలు అందించారని కొనియాడారు. రామయ్య తన కుటుంబ సభ్యులకు సైతం చెట్ల పేర్లను పెట్టి, పర్యావరణంపై తన ప్రేమను చాటుకున్నారని చెప్పారు.
రామయ్య చేసిన సేవలను గుర్తించిన మోదీ ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించిందని తెలిపారు. ఆయన మరణం తెలంగాణకు, పర్యావరణ సమాజానికి తీరని లోటు అని చెప్పారు. వనజీవి బిరుదుతో ప్రసిద్ధిగాంచిన రామయ్య మరణం బాధాకరమని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు.