P Ananda Kumar: సెంట్రల్ జీఎస్టీ ద్వారా ఏపీకి పెరిగిన ఆదాయం ఎంతంటే ..?

- ఏపీకి పెరిగిన సెంట్రల్ జీఎస్టీ ఆదాయం
- గత ఆర్ధిక సంవత్సరంలో రూ.25వేల కోట్ల ఆదాయం వచ్చిందన్న కమిషనర్ ఆనంద్ కుమార్
- 2024 – 25లో రూ.1,510 కోట్ల మేర సెంట్రల్ జీఎస్టీ ఎగవేత
ఆంధ్రప్రదేశ్కు సెంట్రల్ జీఎస్టీ ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పెరిగింది. ఈ విషయాన్ని గుంటూరు సెంట్రల్ జీఎస్టీ ఆడిట్ కమిషనరేట్ కమిషనర్ పి. ఆనంద్ కుమార్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.25 వేల కోట్ల ఆదాయం వచ్చిందని, ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే ఒక శాతం అధికమని ఆయన పేర్కొన్నారు.
విశాఖ జీఎస్టీ భవన్లో ఆయన మీడియా సమావేశంలో పలు అంశాలు వివరించారు. అనంతపురం జిల్లాలో కియా సంస్థ ఉండటం వల్ల అక్కడ పన్ను వసూలు ఎక్కువగా ఉంటుందని చెప్పిన ఆయన, విశాఖలో తగ్గడానికి స్టీల్ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉండటం ఒక కారణంగా పేర్కొన్నారు.
2024-25లో రూ.1,510 కోట్ల మేర సెంట్రల్ జీఎస్టీని ఎగవేసినట్లు గుర్తించామని ఆయన తెలిపారు. 2023-24లో రూ.2,682 కోట్ల పన్నును ఎగవేశారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో సీజీఎస్టీ చెల్లించేవారు 1.81 లక్షల మంది, రాష్ట్ర జీఎస్టీ కట్టేవారు 2 లక్షల మందికి పైగా ఉన్నారని ఆయన వివరించారు. నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు.