Manchu Manoj: వాళ్లు చేసిన కొన్ని పనుల వల్ల మనసు విరిగిపోయింది.. అందుకే ఇంత దూరం వచ్చింది: మంచు మనోజ్

- తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్తో తన ఫ్యామిలీ గొడవలపై మాట్లాడిన మనోజ్
- ఇల్లు, ఇతర ఆస్తులపై తనకు ఏమాత్రం ఇష్టం లేదని వెల్లడి
- తనపై పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికే దాడులకు పాల్పడుతున్నారని వ్యాఖ్య
- గొడవల్లోకి తన భార్యను లాగారంటూ ఆవేదన
- అలా చేయకపోయి ఉంటే తాను ఇంత దూరం వచ్చే వాడిని కాదన్న మంచువారబ్బాయి
గత కొంతకాలంగా మోహన్బాబు కుటుంబం... ఫ్యామిలీ గొడవలతో వరుసగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. బుధవారం నాడు మరోసారి మంచు మనోజ్ జల్పల్లిలోని నివాసం ముందు బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమది ఆస్తి గొడవ కాదని, తన జుట్టు విష్ణు చేతుల్లో పెట్టేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
ఇక తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్తో తన ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలపై మంచు మనోజ్ మాట్లాడారు. ఇది ఆస్తి తగాదా కాదని ఆయన మరోసారి స్పష్టం చేశారు. ఇల్లు, ఇతర ఆస్తులపై తనకు ఏమాత్రం ఇష్టం లేదన్నారు. వాళ్లు చేసిన కొన్ని పనుల వల్ల తన మనసు విరిగిపోయిందని అన్నారు. తనపై పగ, ప్రతీకారాలు తీర్చుకోవడానికే ఈ దాడులకు పాల్పడుతున్నారని ఆయన వాపోయారు.
మంచు మనోజ్ మాట్లాడుతూ... "విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రశ్నించిన సందర్భంలో గొడవలు మొదలయ్యాయి. సుమారు రెండేళ్ల నుంచి గొడవలు జరుగుతున్నాయి. వారిని ప్రశ్నించాననే కారణంతో నా గౌరవానికి భంగం కలిగించే తప్పుడు కథనాలు ప్రచారం చేశారు. నాపై దాదాపు 30కి పైగా తప్పుడు కేసులు పెట్టారు. నాన్న ఆస్తిలో ఒక్క రూపాయి కూడా ఆశించలేదు.
ఈ గొడవల్లోకి నా భార్యను లాగారు. అలా చేయకపోయి ఉంటే నేను ఇంత దూరం వచ్చే వాడిని కాదు. తన వల్లే చెడిపోతున్నానంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎఫ్ఐఆర్లో నా భార్యాబిడ్డల పేర్లు చేర్చడంతో నా మనసు విరిగిపోయింది. నేను ఆస్తి అడగలేదు. ఏ తప్పు చేయలేదు. అందుకే దేనికీ భయపడను" అని మనోజ్ చెప్పుకొచ్చారు.