ఆమె వయసు 30... అబ్బాయి వయసు 18... ఇదో విచిత్ర గాథ!

  • యూపీలో ఘటన
  • హిందూ మతం స్వీకరించిన ముగ్గురు పిల్లల తల్లి
  • 12వ తరగతి విద్యార్థితో వివాహం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా జిల్లాలో ఒక విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. ముగ్గురు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల మహిళ, హిందూ మతాన్ని స్వీకరించి, 12వ తరగతి చదువుతున్న అబ్బాయిని ఆలయంలో వివాహం చేసుకుంది. తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన కుర్రాడితో మహిళ సంబంధం పెట్టుకోవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

హసన్‌పూర్ సర్కిల్ అధికారి దీప్ కుమార్ పంత్ తెలిపిన వివరాల ప్రకారం... షబ్నమ్ అనే మహిళ హిందూ మతం స్వీకరించి తన పేరు శివాని అని మార్చుకుంది. ఆమెకు తల్లిదండ్రులు లేరు. ఇదివరకే రెండుసార్లు వివాహం జరిగింది. 

పోలీసులు ప్రస్తుతం ఈ వివాహం జరిగిన పరిస్థితులపై సమీక్ష చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదులు అందలేదని సమాచారం. శివాని తొలుత మీరట్‌లో ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. అనంతరం, సైదాన్వాలి గ్రామానికి చెందిన తౌఫీక్‌ను వివాహం చేసుకుంది. 2011లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తౌఫీక్ వికలాంగుడు అయ్యాడు.

కొంతకాలంగా శివానికి 12వ తరగతి చదువుతున్న 18 ఏళ్ల కుర్రాడితో సంబంధం ఏర్పడింది. గత శుక్రవారం షబ్నమ్... తౌఫీక్ నుంచి విడాకులు పొందింది. ఆ తరువాత ఆమె హిందూ మతాన్ని స్వీకరించి శివానిగా పేరు మార్చుకుంది.

కాగా, 12వ తరగతి విద్యార్థి తండ్రి విలేకరులతో మాట్లాడుతూ, తన కుమారుడి నిర్ణయాన్ని తాను సమర్థిస్తున్నానని తెలిపారు. వారిద్దరూ సంతోషంగా ఉంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, వారిద్దరూ సుఖంగా జీవించాలని కోరుకుంటున్నామని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్‌లో మత మార్పిడి నిరోధక చట్టం అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం బలవంతంగా లేదా మోసపూరితంగా మత మార్పిడి చేయడం నేరం. దీనిపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.


More Telugu News