Narendra Modi: తిరుపతి-కాట్పాడి ట్రాక్ డబ్లింగ్ పై ప్రధాని మోదీ ట్వీట్... చంద్రబాబు స్పందన

- తిరుపతి-కాట్పాడి రైలు మార్గం డబ్లింగ్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- రూ. 1,332 కోట్ల నిధులు మంజూరు
- ఏపీ, తమిళనాడు మధ్య రద్దీని తగ్గిస్తుందన్న మోదీ
- వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందన్న చంద్రబాబు
తిరుపతి-పాకాల-కాట్పాడి రైలు మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. కేంద్ర మంత్రివర్గం తిరుపతి-పాకాల-కాట్పాడి రైల్వే మార్గాన్ని డబ్లింగ్ చేసేందుకు ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఈ నిర్ణయం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల మధ్య రద్దీని తగ్గించడంతోపాటు, యాత్రికులు, పర్యాటకులకు రైలు కనెక్టివిటీని మెరుగుపరుస్తుందని మోదీ వివరించారు. అంతేకాకుండా సరుకు రవాణా సామర్థ్యాన్ని కూడా పెంచుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ ప్రాంతంలో రైల్వే సదుపాయాలు మరింత మెరుగుపడతాయని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ట్వీట్ పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు.
"తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్ డబ్లింగ్ ప్రాజెక్టుకు రూ. 1,332 కోట్లు మంజూరు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు, కేంద్ర మంత్రివర్గానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రాజెక్టుతో తిరుపతి బాలాజీ ఆలయం, శ్రీకాళహస్తి శివాలయం , చంద్రగిరి కోట వంటి పవిత్ర స్థలాలను అనుసంధానం చేసేందుకు వీలవుతుంది.
అంతేకాకుండా, ఇది వేలూరు, తిరుపతి వంటి విద్యా, వైద్య కేంద్రాలకు రాకపోకలను సులభతరం చేస్తుంది. ఇది వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్స్, సిమెంట్, ఉక్కు పరిశ్రమల వృద్ధిని వేగవంతం చేస్తుంది. చిత్తూరు, తిరుపతి జిల్లాలకు, ఈ లైన్ కనెక్టివిటీ, అభివృద్ధి యొక్క కొత్త శకానికి నాంది పలుకుతుంది" అని చంద్రబాబు పేర్కొన్నారు.