Pawan Kalyan: అరకు అద్భుతమైన ప్రాంతం... దీన్ని సరిగా ఉపయోగించుకోవాలి: పవన్ కల్యాణ్

- అల్లూరి జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
- డుంబ్రిగూడలో అడవితల్లి బాటు కార్యక్రమం
- అడవితల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని వెల్లడి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరకు అభివృద్ధికి నడుం బిగించారు. పవన్ ఇవాళ అల్లూరి జిల్లా డుంబ్రిగుడలో 'అడవితల్లి బాట' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అడవి తల్లిని నమ్ముకుంటే అన్నం పెడుతుందని, నీడనిస్తుందని అన్నారు.
అరకు ఒక అద్భుతమైన ప్రాంతమని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని, పర్యాటకంగా మరింత అభివృద్ధి చేయాలని ఆయన ఆకాంక్షించారు. మన్యం ప్రాంతాల్లో సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గిరిజన ప్రజల జీవనశైలిని మెరుగుపరచాలని ఆయన పేర్కొన్నారు.
గిరిజన ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి నిధులు కావాలని కోరితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి రూ.49 కోట్లు మంజూరు చేయడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్లలో రహదారులకు రూ.92 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం ఏడాదిలోపే రూ.1,500 కోట్ల విలువైన పనులను మంజూరు చేసిందని పవన్ కళ్యాణ్ తెలిపారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు.
పవన్ తన పర్యటనలో భాగంగా పెదపాడు గ్రామంలో గిరిజనులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను ఆరు నెలల్లో పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.