సీఎం రేవంత్ రెడ్డి చేసింది త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌... బాలీవుడ్ న‌టి దియా మిర్జా మండిపాటు!

  • హైద‌రాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వివాదం
  • తాను న‌కిలీ ఏఐ ఫొటోలు/వీడియోలను ఉప‌యోగించాన‌ని సీఎం చెప్ప‌డం త‌ప్పుడు ప్ర‌క‌ట‌న అన్న న‌టి
  • తాను పోస్ట్ చేసినవి ఒరిజిన‌ల్ వీడియోలంటూ ట్వీట్‌
హైద‌రాబాద్ కంచ గచ్చిబౌలి భూముల వ్య‌వ‌హారంపై బాలీవుడ్ న‌టి దియా మిర్జా తెలంగాణ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. తాను కంచ గ‌చ్చిబౌలి ప‌రిస్థితుల‌ను తెలియ‌జేసే న‌కిలీ ఏఐ ఫొటోలు/వీడియోలను ఉప‌యోగించాన‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్ప‌డం పూర్తి త‌ప్పుడు ప్ర‌క‌టన‌గా ఆమె పేర్కొన్నారు. తాను పోస్ట్ చేసినవి ఒరిజిన‌ల్ వీడియోలు అని 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా దియా మిర్జా స్పష్టం చేశారు. 

"తెలంగాణ ముఖ్యమంత్రి నిన్న ఒక ట్వీట్ చేశారు. కంచ గచ్చిబౌలి వద్ద పరిస్థితి గురించి ఆయన కొన్ని వాదనలు చేశారు. వాటిలో ఒకటి, ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమిపై జీవవైవిధ్యాన్ని కాపాడాలని విద్యార్థులు చేసిన నిరసనకు మద్దతుగా నేను నకిలీ ఏఐ రూపొందించిన చిత్రాలు/వీడియోలను ఉపయోగించానని అన్నారు. ఇది పూర్తిగా తప్పుడు ప్రకటన. నేను ఏఐ రూపొందించిన ఒక్క చిత్రం లేదా వీడియోను కూడా పోస్ట్ చేయలేదు. నేను పోస్ట్ చేసినవి ఒరిజిన‌ల్ వీడియోలు. మీడియా, తెలంగాణ ప్రభుత్వం అలాంటి వాదనలు చేసే ముందు వాస్తవాలను ధృవీకరించుకోవాలి" అని దియా మిర్జా ట్వీట్ చేశారు. 


More Telugu News